కరోనా కారణంగా కాలేజీలు, స్కూళ్లూ, హాస్టళ్లు లేకపోయినా జగన్ మోహన్ రెడ్డి వందల కోట్లు విద్యార్ధుల పేరుతో ఎవరికి పంచుతున్నారని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ యస్.విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.
అనంతపురంలో నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. వేల కోట్ల రూపాయలు ప్రజలకు పంచుతున్నానే పత్రికా ప్రకటనలు చూస్తే జగన్ మోహన్ రెడ్డి రాజు మాదిరిగా ఆయన సొంత ఆస్తులు పంచుతున్నట్లుగా ఉందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
తన సొంత డబ్బు పంచుతున్నట్లు ఆయన అహంకార పూరితంగా వ్యవహరిస్తుండటం దేనికి సంకేతమని విష్ణు వర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. జగనన్న ఇళ్ల పట్టాల పేరుతో వేల కోట్ల రూపాయల కుంభకోణాన్ని మెదట బయటపెట్టింది బిజెపియేనని ఆయన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో అవభూముల కుంభకోణం ను వెలికి తీసింది తమ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు అని ఆయన తెలిపారు.
సోమూవీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల ఆస్తుల రక్షణ విషయం లో, రామతీర్థం, రథం తగలబెట్టిన ఘటన సహా అనేక దేవాలయాలపై జరిగిన దాడులపై పోరాటం సోము వీర్రాజు పోరాటం చేశారని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
సీఎం జగన్ బయటికి రాని సమయం లో కోవిడ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ బిజెపి కరోనా రోగులకు సేవలు అందించిందని ఆయన తెలిపారు. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ల పై టీడీపీ, వైఎస్ఆర్సీపీ మోసం చేస్తే తమ పార్టీ పోరాడి సాధించిందని ఆయన అన్నారు. రాష్ట్రం జగనన్న మయం అన్నట్లు పథకాల పేర్లు పెడుతున్నారని, కేంద్రం లో అధికారంలో ఉన్న మోడీ పేరుతో ఒక్క పథకం అయినా మేం పెట్టుకున్నామా అని ఆయన ప్రశ్నించారు.
ఏపీలో దగా…మోసపూరిత ప్రభుత్వం నడుస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. గతం లో ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం నేడు 30 లక్షల ఇల్లు కడతాం అని ప్రజలను మోసం చేస్తున్నదని ఆయన అన్నారు.