రాయలసీమ రైతుల అవసరాల కోసం వాడాల్సిన కృష్ణా జలాలను విద్యుత్ ఉత్పత్తి కోసం వృధా చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో లేనిపోని హడావుడి చేసిన లక్ష్మీనారాయణకు కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అన్యాయం కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు.
రాజకీయాలు ప్రజల కోసం లక్ష్మీనారాయణ వాడుకున్న స్టీల్ ప్లాంట్ విషయం కన్నా రాయలసీమ నీటి సమస్య విస్తృతమైనది. కృష్ణాజలాల విషయంలో ప్రజలకు మద్దతుగా నిలబడి జాతీయ పార్టీ పేరుతో రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ ను ప్రశ్నించి మీ నిజాయితీని నిరూపించుకోండి లక్ష్మీనారాయణ గారూ అని విష్ణువర్ధన్ రెడ్డి హితవు పలికారు. బీఆర్ఎస్ నేతలు కృష్ణా జలాల విషయంలో చేస్తున్న అన్యాయంపై కూడా అదే పట్టుదల చూపించి ప్రజల మనసు గెలుచుకోవాలని ఆయన కోరారు.
లక్ష్మీనారాయణ తో బాటు ఏపి బీఆర్ఎస్ నాయకులు కూడా కేసీఆర్ ను ఈ విషయంపై ప్రశ్నించాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. దిగువ రాష్ట్రమైన ఏపీ న్యాయమైన నీటి కేటాయింపులపై మద్దతుగా మాట్లాడగలరా? సీమకు చెందాల్సిన నీటిని అనవసర విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు వదిలివేస్తున్న వైనంపై కేటీఆర్ BRS జాతీయ పార్టీగా మీ స్పందనేమిటి ? ప్రాజెక్టుల నిర్వహణ కృష్ణాబోర్డుకు ఇచ్చేందుకు అభ్యంతరాలెందుకు? ఏపీలో నాలుగు కోట్ల గొంతులు మిమ్మల్ని , మీ పార్టీని, మీరు దిగుమతి చేసుకున్న మీ (స్పాన్సర్ )నేతలను సైతం నేడు ప్రశ్నిస్తున్నాయి సమాధానం చెప్పండి అని ఆయన డిమాండ్ చేశారు.