వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో విమర్శించినా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? తెలియదు. ఎవరు ఎవర్ని విమర్శిస్తే ఎవరు మౌనంగా ఉంటున్నారు? అని మీ ప్రశ్నా?
ఇప్పటికే చాలా మందికి అర్ధం అయి ఉంటుంది… వై ఎస్ షర్మిల, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అతితీవ్రంగా విమర్శించారు.
ఖమ్మం సభలో ఆమె కేసీఆర్ ను దుమ్మెత్తి పోశారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ లో దారుణమైన అవినీతి జరిగిందని కుండబద్దలు కొట్టారు.
కేసీఆర్ ఇంట్లో తప్ప తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావడం లేదని అత్యంత తీవ్రంగా విమర్శించారు. నిరుద్యోగులకు మద్దతుగా నేటి నుంచి షర్మిల రిలే నిరాహార దీక్షలు కూడా ప్రారంభిస్తున్నారు……..
అయినా సరే….
అధికార పార్టీ టీఆర్ఎస్ నోరు మెదపడం లేదు. సభ పూర్తి అయి 48 గంటలు దాటినా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడా మాట్లాడటం లేదు.
ఆంధ్రాకు చెందిన షర్మిల వచ్చి తెలంగాణ లో పార్టీ పెడుతుండటమే కాకుండా తెలంగాణ జాతి పిత అయిన కేసీఆర్ ను నోటికి వచ్చినట్లు దూషిస్తున్నా ఎందుకు మౌనం? అర్ధం కావడం లేదు.
షర్మిల పెట్టబోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ వైపున ఉండే రెడ్డి సామాజిక వర్గం ఓట్లను గణనీయంగా చీలేందుకు అవకాశం ఉందని అందువల్లే టీఆర్ఎస్ ఏమీ మాట్లాడడం లేదని అంటున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న రెడ్డి కులస్తులు, క్రిస్టియన్ మైనారిటీలు, దళితులలోని కొన్ని వర్గాలు షర్మిల పార్టీ పెడితే అటుగా వెళ్లిపోయే అవకాశం కనిపిస్తున్నది.
ఇలా ఓట్ల చీలిక టీఆర్ఎస్ పార్టీకి లాభిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఏపిలో పట్టిన గతి పడుతుంది.
అందుకే కేసీఆర్, తనను షర్మిల తిట్టినా మౌనం వహిస్తున్నారని అంటున్నారు. నిజమా?