గుజరాత్లో మోర్బీ బ్రిడ్జి ప్రమాదం జరిగిన తర్వాత ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 135 మంది మరణించిన ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటన గుజరాత్ పేరుకే తలవంపులు తెచ్చిందని అన్నారు.
అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, వంతెన ప్రమాదానికి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎవరిపైనా చర్య తీసుకోలేదు. ప్రమాదానికి బాధ్యత వహిస్తూ ఎవరూ రాజీనామా చేయలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. గుజరాత్ ప్రభుత్వాన్ని అక్కడి ముఖ్యమంత్రి నడపడం లేదని, దానిని ఢిల్లీ లో పెద్దలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు.