ఆంధ్రప్రదేశ్ లో 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వారికి ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించిన ప్రభుత్వం వెంటనే యూటర్న్ తీసుకోవడంలోని ఆంతర్యమేమిటని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పథకాల కోసం నిధులు ఖర్చు పెట్టడంలో చూపించే శ్రద్ధ రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడటం లో సైతం చూపించాలని ఆయన కోరారు. భారతదేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కట్టడిలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయని ఆయన అన్నారు.
దేశంలో కరోనా వైరస్ సోకకుండా ముందస్తుగా మొదట విడత వ్యాక్సింగ్ (కోవ్యాక్సిన్) చేసుకున్న వారికి రెండో విడత వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో సహా పార్టీలకు అతీతంగా ఢిల్లీలోని మన లోక్ సభ, రాజ్యసభ సభ్యులు కరోనా వైరస్ వ్యాక్సిన్ కొనుగోలుకు,అదనపు వైద్య పరికరాలు,ప్రాణవాయువు, వెంటిలేటర్లు,బెడ్ల కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి నిధులు రాబట్టాలని, రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడాలని ఆయన కోరారు.
శ్రీవాణి ట్రస్టు నిధులతో టిటిడి విద్యాసంస్థలలో వసతి ఏర్పాటు చేసి బెడ్లు,ప్రాణవాయువు (oxygen),వైద్య సిబ్బంది, వైరస్ బాధితులకు ఉచితంగా మందులు, అన్నదానం,ఇస్కాన్ నుంచి పౌష్టిక ఆహారం అందించేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.