బద్వేల్ లో బిజెపికి బలం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పడాన్ని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బిజెపికి బలం లేకపోతే నలుగురు మంత్రులు, ముగ్గురు ఎంపిలు, 32 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి ఎందుకు ప్రచారం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. బిజెపి బలం చూసి కళ్లు తిరిగిన వైసీపీ అధిష్టానం తన శక్తి మొత్తాన్నీ బద్వేల్ పై నే ఫోకస్ చేసిందని ఆయన అన్నారు. యథేచ్ఛగా అధికార దుర్వినియోగం చేస్తూ విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆయన అన్నారు.
బద్వేల్ లో వైయస్ఆర్ పార్టీ నుండి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సురేష్, అంజాద్ బాషా, ఎల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీలు గురు మూర్తి, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి పది రోజులుగా బద్వేల్ లోనే క్యాంప్ వేశారని ఆయన అన్నారు. వీరే కాకుండా కర్నూలు నుండి 5 మంది ఎమ్మెల్యేలు, నెల్లూరు నుండి 6 మంది ఎమ్మెల్యేలు, చిత్తూరు నుండి 6 మంది ఎమ్మెల్యేలు, అనంతపురం నుండి 7 మంది ఎమ్మెల్యేలు, కడప జిల్లా నుండి 8 మంది ఎమ్మెల్యేలు బద్వేల్ లో ఉన్నారని ఆయన తెలిపారు.
మరి వీరంతా ఎందుకు వచ్చారు ? రిగ్గింగు చేయడానికా? ప్రజలను బెదిరించడానికా ఇంతమంది ఏందుకోచ్చారు ? ప్రజలకు సమాధానం చెప్పండి అంటూ విష్ణువర్ధన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
వీరే కాకుండా అదనంగా కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు 100 మంది పైనే బద్వేల్ లో క్యాంప్ వేసి ఉన్నారని ఆయన తెలిపారు. బలహీనమైన ప్రత్యర్థి అయినప్పుడు, ఇంత పెద్ద ఎత్తున మంది మార్బలంతో బద్వేలుకు ఎందుకు వచ్చారు? దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు బద్వేల్ లో ఏం జరుగుతుందో,బీజేపీ బలం ఏంతో. ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిపించండి. అధికార బలంతో మీరు ఓటర్లను బెదిరిస్తే ఈ ఎన్నికల్లో కచ్చితంగా ప్రజల్లో వైసీపీ బుద్ధి చెప్తారు అంటూ విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు.