జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సిత్ర విసిత్రాలు చోటు చేసుకుంటున్నాయి.. ప్రశ్నించిన వారితో ఆయా రాజకీయ నేతల అనుచరులు గలాటాలు పెట్టుకుంటుంటే… మరోవైపు ఓటు వేద్దామనుకున్న వారి పేర్లు గల్లంతయ్యాయి. ఇంకోవైపు మెండుగా ఓటర్ల లిస్టులో పేర్లు ఉంటే అక్కడి ప్రాంతం వారు మాత్రం ఓట్లు వేయడానికి పూర్తిగా అనాసక్తత ప్రదర్శిస్తున్నారు.
దీనికి కారణం ఏమై ఉంటుందా? అనే విషయం ఎవ్వరికీ తెలియందేమీ కాదు.. బ్రహ్మస్ర్తం ఏమీ కాదు.. అందరికీ తెలిసిందే.. ఇక మీడియానైతే ఒకింత ముందుకు చేరి చిలువలు పలువులుగా చిలక పలుకుల మాదిరి ఓటర్ల అనాసక్తత… ఎందుకు రావడం లేదు.. చేతగాని వారు సైతం వస్తున్నారని? ఓటు వేస్తున్నారని అదరగొడుతున్నారు.
చనిపోయిన వారి పేర్లు ఓటర్ల లిస్టులో ప్రత్యక్షమవుతుంటే… సాక్షాత్తూ ఓటు వేసేందుకు వెళ్ళిన అభ్యర్థి పేరు మాత్రం లిస్టులో చనిపోయినట్లుగా ఉండడం గమనార్హం.. ఓ వైపు ఎలక్షన్ కమిషన్ మేమన్నీ చేశాం.. మేమంతా చేశాం.. అని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇదేనా మీరు చేసింది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు?
దీనికి ఈసీ ఏ సమాధానం చెబుతుందో? ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంతో? చిలుక పలుకుల ఓటింగ్ అందరూ పాల్గొనాలంటున్న వారు ఏం సమాధానం చెబుతారో? ఓటు లిస్టులో నమోదు చేయించుకోవడానికి కూడా రెండు వందలు సామాన్యుడు ఖర్చు పెట్టుకోవాల్సి రావడం మన కర్మ కాకపోతే ఏంటిది?
ఈసేవా, మీసేవా.. వీళ్ళ సేవా… వాళ్ళ సేవా..? అంటూ ఓటు నమోదు చేసుకోవడానికి ఇంత తతంగమా? ఇంత తతంగం నడిచాక ఓటరు ఓటింగ్లో ఎందుకు పాల్గొనాలి?
అనాసక్తత ఎందుకంటే?
అన్నీ రాజకీయ నాయకులు, వారి వారి అనుచరులు, బంధుగణాలకే పథకాల ఫలాలను అందజేస్తున్నారు.. ఓటరు ఎందుకు ఓటింగ్లో పాల్గొనాలి? రేషన్ కార్డులో పేరునమోదు చేయించుకోవాలంటే వంద ఖర్చు… నాలుగేళ్ళు చెప్పులరిగేలా అధికారులు, ఆఫీసుల చుట్టూ తిరగాలి ఇంత చేసినా రేషన్ కార్డు వస్తుందో లేదో తెలియదు..?
పింఛన్ నమోదు చేసుకోవాలంటే.. ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వచ్చిన ఓ మహిళ వితంతు.. ఆమె రేషన్ కార్డు కట్ అయ్యింది. గత ఐదేళ్లుగా ఆమెకు పింఛన్ లేదు.. రేషన్ కార్డు లేదని పింఛన్ను కట్ చేశారు..? ఆమె ఓటు ఎందుకు వేయాలి.. ఆమె కుటుంబం ఓటు ఎందుకు వేయాలి?
ఇక నిన్న మొన్నటి వరద సహాయం.. కేవలం రాజకీయ నేతలు, వారి వారి అనుచరులు.. బంధుగణాలకు తప్ప ఇంకా ఎవరికైనా అందిందా? అలాంటి పరిస్థితుల్లో ఓటు ఎందుకు వేయాలి.. ఎవరి కోసం వేయాలి.. ప్రశ్నించాలి? ప్రశ్నించాలి? ప్రశ్నించాలి? అని చెప్పుకోవడం వరకే బాగుంటుంది కానీ నిజంగా ప్రశ్నించడం వల్ల దక్కేదేం లేదు…
ఓ వైపు అవినీతి అధికారులంతా రిగ్గింగ్లా రాజకీయ నేతలతో చేతులు కలిపి ప్రజలను పీడీస్తున్న దాఖలాలు కోకొల్లలు ప్రభుత్వానికి మీడియాకు కనిపించడం లేదా? అంటే అన్ని కనిపిస్తున్నాయి… మరీ ఓటరు ఓటు ఎందుకు వేయాలి… వారి తిండి వాడు తింటూ.. వాడి బతుకు వాడు బతుకుతూ.. అర్థనో… అణానో సంపాదించుకుంటుంటే… అందులో నుంచి ఇంటిట్యాక్సు, నల్లా కనెక్షన్, ఇల్లు కట్టుకుంటే.. చివరాఖరికి ఖర్మకాండాలకు కూడా లంచవతారాలు ఇక్కడ ఇదే జీహెచ్ఎంసీలో నోర్లు తెరుచుకుంటుంటే ఈ సమాజంలో ఓటు అనేదానికి ఇక ప్రాధాన్యత ఎక్కడ ఉంది..
ఎందుకు ఓటేయ్యాలి… ఇది నేను అడిగిన ప్రశ్నలకు పలువురు ఓటు వేయని అభ్యర్థుల సమాధానం.. మరీ ఇక ఈ ప్రశ్నలకు బదులు ఏ నాయకుల వద్ద ఉందో? ఏ అధికారుల వద్ద ఉందో… ఓట్లేయండంటూ.. చిలుక పలుకులు పలుకుతున్నఎవరి వద్ద ఉందో.. ఒక్కసారి సమాధానాలు చెప్పి ఓట్లేయండని తెలియజేస్తే బాగుంటుంది.
పడకంటి నాగరాజు, సత్యం న్యూస్