తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ పేరు ఎత్తితే ఎందుకు భయపడుతున్నారని భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా అధికార ప్రతినిధి షేక్ రహ్మతుల్లా ప్రశ్నించారు. సర్జికల్ స్ట్రైక్ అనే పదం చూసి భారతీయులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
ఆయన సత్యం న్యూస్ తో మాట్లాడుతూ భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు తిష్ట వేసి ఉన్న ప్రాంతాలలో భారత సైన్యం దాడులు చేసి ఎలాగైతే వారిని ఏరివేసిందో అదే విధంగా హైదరాబాద్ లో తిష్టవేసి ఉన్న విదేశీయులను ఏరివేస్తామని మాత్రమే బండి సంజయ్ అన్నారని రహ్మతుల్లా అన్నారు.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్, మయన్మార్ లాంటి దేశాల నుంచి వచ్చి చట్ట విరుద్ధంగా మన దేశంలో ఉంటున్న వారిని ఏరివేయడమే ఆయన ఉద్దేశ్యమని రహ్మతుల్లా అన్నారు. దీనికి ఏ భారతీయుడు భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఈ విషయాన్ని పెద్దది చేసి చూపించడం అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.