అసెంబ్లీ ఎన్నికలలో 151 సీట్లతో అప్రతిహత విజయం సాధించిన యువ నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదు. జెడ్ పి టి సి, ఎంపిటిసి ఎన్నికలలో రికార్డు స్థాయిలో ఏకగ్రీవాలు సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు పార్టీ రహితంగా జరుగుతున్న గ్రామ పంచాయితీ ఎన్నికలకు ఎందుకు అడ్డుతగులుతున్నారో అర్ధం కావడం లేదు.
40 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని హైదరాబాద్ లో ఇంటికే పరిమితం చేశామని, జూమ్ కాల్స్ రాజకీయానికి పరిమితం చేశామని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలను అడ్డుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారో కూడా అర్ధం కావడం లేదు.
గ్రామ పంచాయితీలు అన్నీ కూడా అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. ఏ గ్రామంలోని పెద్దలు కూడా ఎమ్మెల్యే అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించరు. ఇది బేసిక్ ప్రిన్సిపుల్. అలాంటిది ఎన్నికలు జరిపించి అన్ని చోట్లా తామే గెలిచామని ప్రకటించుకోవడం ద్వారా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎంతో రాజకీయలబ్ది చేకూరి ఉండేది.
పంచాయితీ ఎన్నికల సందర్భాన్ని ఎంతో బాగా వాడుకోవచ్చు
ఈ ప్రభావంతో ఇప్పటి వరకూ ప్రభుత్వం పై వచ్చిన వ్యతిరేకతను పూర్తిగా రూపుమాపుకునేందుకు అవకాశం కూడా కలుగుతుంది. దేవాలయాల విధ్వంసం తదితర అంశాలన్నీ మరుగున పడేసేందుకు గ్రామ పంచాయితీ ఎన్నికలను వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉపయోగించుకునే అవకాశం పూర్తిగా ఉండేది.
రాబోయే రోజుల్లో తనకు రాష్ట్రంలో రాజకీయంగా అడ్డులేకుండా చేసేందుకు కూడా గ్రామ పంచాయితీ ఎన్నికల అంశం ఉపయోగపడేది. అయితే ఇవన్నీ కాలదున్నుకుని కేవలం ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పోరాటం చేస్తున్నారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా ఉన్న సమయంలోనే రికార్డు స్థాయి ఏకగ్రీవాలు సాధించిన విషయాన్ని ఆవేశంలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మర్చిపోతున్నారు. డాక్టర్ రమేష్ కుమార్ వివాదాల జోలికి ఎన్నడూ వెళ్లకుండా తనకు అప్పగించిన బాధ్యతలు నెరవేర్చే అధికారిగా పేరు పొందారు.
డాక్టర్ రమేష్ కుమార్ లాంటి అధికారులు ఉండాలని అప్పటిలో ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి అనేవారు. అలాంటి అధికారితో కేవలం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేలవిడిచి సాము చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో, ఉద్యోగ సంఘాల నాయకులతో రాష్ట్ర ఎన్నికల సంఘంపై తిరుగుబాటు చేయిస్తున్నారు. ఈ విధమైన పోకడలు ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం పోలేదు. ఇప్పటి వరకూ ఒక్కోవ్యవస్థ పైనా తిరుగుబాటు చేస్తున్న వారు ఇప్పుడు అదే విద్యను కింది స్థాయి ఉద్యోగులకు కూడా నేర్పుతున్నారు.
పై అధికారులు ఇచ్చే ఆదేశాలను పాటించే క్రమశిక్షణ నుంచి ఉద్యోగులు పక్కకు జరిగితే విపరీత పరిణామాలు తలెత్తుతాయి. పోలీసుల సంఘం కూడా ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు విని చట్టబద్ద సంస్థలపై పోరాటానికి, శాసనోల్లంఘనకు దిగుతున్నది. ఇది అరాచకానికి దారితీస్తుంది.