కుట్ర పూరితంగా వైజాగ్ ను రాజధానిగా మారుస్తుంటే ప్రకాశం జిల్లా వైకాపా నాయకులు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో చెప్పాలని కొండపి శాసనసభ్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి డిమాండ్ చేశారు. వైకాపా నాయకులు వ్యవహారం చూస్తుంటే దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయ్యమన్నట్లుగా ఉందని ఆయన అన్నారు.
రాజధానిగా వైజాగ్ ను ఏర్పాటు చేస్తే ప్రకాశం జిల్లా వైకాపా నాయకులు జగన్ రెడ్డి ఫోటోలకు క్షీరాభిషేకం చేయడం జిల్లా ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసిందని ఎమ్మెల్యే అన్నారు. అసలు ఎందుకు పాలాభిషేకం చేస్తున్నారో కూడా వారికి అర్ధం కాని పరిస్థితి ఉందని, ప్రకాశం జిల్లా నుంచి 170 కి.మీ. దగ్గరలో ఉన్న రాజధానిని తీసుకుపోయి 550 కి. మీ. దూరంలో ఉన్న విశాఖపట్నానికి మార్చినందుకు క్షీరాభిషేకం చేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు.
హైకోర్టు ను 350 కి మీ దూరంలో ఉన్న కర్నూలు కు తరలిస్తునందుకు ప్రకాశం జిల్లా ప్రజలు భవిష్యత్తులో పడబోతున్న ఇక్కట్లును తలుచుకొని వైకాపా నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలు కొంత మంది భూములు దోచుకునేందుకు వైజాగ్ లో రాజధాని పేరుతో రాజకీయం చేస్తున్నారని, మరి ప్రకాశం జిల్లా నాయకులు కూడా అందులో భూములు కొన్నారా అందుకే సంబరాలు చేసుకుంటున్నారా ? అని ఆయన ప్రశ్నించారు.
మూడు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రగల్బాలు పలికే ఈ పెద్ద మనుషులకు ప్రకాశం జిల్లా ప్రయోజనాలు పట్టవా ? హైకోర్టు రాజధాని జిల్లా ప్రజలకు అందనంత దూరం మార్చినందుకు పాలాభిషేకం చేశారా? మీకు ప్రజల సౌలభ్యాలు పట్టవా ? తెలుగుదేశం హయాంలో జిల్లాకు వచ్చిన కంపెనీలన్నీ వైకాపా ప్రభుత్వ దుర్మార్గపు చర్యలకు వెనక్కి వెళ్లిపోయేలా చేశారని ఆయన అన్నారు. అవి అన్ని మరిచిపోయి సంబరాలు చేసుకుంటున్నందుకు వైకాపా నాయకులు సిగ్గుపడాలని ఎమ్మెల్యే అన్నారు.