ప్రియుడి పై వున్న మోజుతో తాళికట్టిన భర్తను భార్య హత్య చేయించిన సంఘటనలో సుబేదారి పోలీసులు మొత్తం నలుగురిని శుక్రవారం అరెస్టు చేశారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్ వివరాలను వెల్లడిస్తూ గత జనవరి నెల 24 తేదిన వడ్డేపల్లి ప్రాంతానికి చెందిన తాళ్ళపల్లి అనిల్ అనే వ్యక్తి కనబడటం లేదని అతని భార్య తాళ్ళపల్లి పూజిత ఇచ్చిన ఫిర్యాదుపై మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు.
సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డి.సి.పి పుష్పా సూచనల మేరకు సుబేదారి ఇన్స్పెక్టర్ అధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. జనవరి 29 న అనిల్ రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్ లో శవమైన కనిపించాడు.
అనిల్ మరణానికి సంబంధించి మృతుడి భార్య పూజితపై బంధువులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక దృష్టిసారించి విచారణ చేపట్టారు.
2018లో మృతుడికి వరుసకు తమ్మడైన హన్మకొండ డ్యాని వద్ద మృతుడు అనీల్ తన ట్రాలీ ఆటోను తనాఖా పెట్టి లక్ష రూపాయలను అప్పుగా తీసుకున్నాడు.
అప్పు తీర్చే క్రమంలో అక్రమ సంబంధం
డ్యాని ప్రతి రోజు మృతుడు ఇంటికి వెళ్ళి అప్పు వాయిదా పద్ధతిలో డబ్బును తీసుకోనేవాడు. ఇదే క్రమములో నిందితుడికి ప్రధాన నిందితురాలు మృతుడు భార్యపూజితకు మధ్య పరిచయం కావడంతో వీరి మధ్య పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. నిందితులు శారీరకంగా కలుసుకోనేందుకు నిందితుడు డ్యాని అక్కయిన మరో నిందితురాలు సుధామణి తన ఇంటిలోనే అవకాశం కల్పిస్తూ వీరికి సహకరించేది.
తన భర్తను చంపి అడ్డు తొలగించుకుంటే తామిద్దరం కల్సి జీవించవచ్చని నిందితురాలు పూజిత డ్యానికి సూచించింది. గత జనవరి 22వ తేదీన తన భర్త అనిల్ హైదరాబాదు వెళ్ళినట్లుగా డ్యానీకి తెలిపగా, డ్యానీ సూచన మేరకు వంద ఫీట్ల రోడ్డు మార్గం వద్ద కారులో వచ్చిన డ్యానీని కలుసుకున్న పూజిత తన భర్తను చంపాల్సిందిగా సూచించడంతో మృతుడు అనిల్ ను చంపేందుకు నిందితుడు డ్యానీ నిర్ణయించుకున్నాడు.
ఫాతీమా జంక్షన్ వద్ద బస్సు దిగి ఆటోలో ఇంటికి బయలుదేరిన మృతుడిని నిందితులు డ్యానీ, సతీష్ కారులో వెంబడించారు. వడ్డెపల్లి చర్చ్ వద్ద దిగిన మృతుడు అనిల్ ను పనివుందని కారులో ఎక్కించుకోని పెగడపల్లి డబ్బాలు,వంగపహాడ్ మీదుగా, అవుటర్ రింగ్ రోడ్డు మీదకు చేరుకోని అక్కడే కారులోనే మృతుడుతో కల్సిన మద్యం సేవించారు.
రాత్రి 10.30 గంటల సమయంలో నిందితులు ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం మృతుడు అనిల్ ను కారులో ఎక్కించుకోని భీమారం మీదుగా హసన్పర్తి మండలం అనంతసాగర్ కెనాల్ వద్ద చేరుకోని నిందితులిద్దరు కల్సి మృతుడు అనిల్ ను తీవ్రంగా కొట్టడంతో పాటు మృతుడు అనిల్ ఒంటిపై వున్న చోక్కను విప్పి చోక్కతో అనిల్ గోంతుని బిగించి హత్య చేశారు.
పోలీసుల దర్యాప్తులో మృతుడి మరణానికి కారణం భార్య పూజితతో పాటు, హన్మకొండ డానీ, హన్మకొండ సతీష్,కొట్టి సుధామణిలు నిందితులని పోలీసులు నిర్వహించిన విచారణలో తెలడంతో సుబేదారి పోలీసులు నిందితులను ఈ రోజు అరెస్టు చేశారు.
హత్య కేసును ఛేదించి నిందితులను గుర్తించి అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులను, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.