కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్ లో అత్తింటి ముందు కోడలు ఆందోళన చేపట్టింది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి లావణ్యకు 5 సంవత్సరాల క్రితం సతీష్ తో పెళ్లయింది. వీరిద్దరికి నాలుగు సంవత్సరాల బాబు ఉన్నాడు. గత సంవత్సర కాలంగా అత్త రాజేశ్వరి ఆడపడుచులు కలిసి లావణ్యను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు.
సంవత్సరం క్రితం మహిళ సంఘాల చొరవతో భర్తతో కలిసి ఆరు నెలల పాటు బయట అద్దెకు ఉంది. ఆరు నెలల నుంచి సతీష్ తల్లిదండ్రులతో ఉంటున్నాడు. తల్లి మాటలు విని భర్త కూడా అదనపు కట్నం తెస్తేనే రావాలని వేధించసాగాడు. అద్దె చెల్లించలేని స్థితిలో ఉన్న లావణ్య నేడు అత్తింటికి రాగా ఆమెని ఇంట్లోకి రానివ్వలేదు.
దాంతో ఆమె ఇంటి బయట కొడుకు, ఆమె తల్లిదండ్రులతో కలిసి ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటుంది. అయితే గత నెల రోజుల నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న కౌన్సిలింగ్ కు భర్త, అత్త మాత్రమే వస్తున్నారు. మామ రామస్వామిని కౌన్సిలింగ్ కు రానివడంలేదు.
మామ కూడా కౌన్సిలింగ్ కు వస్తే అసలు విషయం బయట పడుతుందని లావణ్య చెప్తుంది. కొత్తగా ఇల్లు కట్టుకున్న విషయం కూడా తనకు చెప్పలేదని, ప్రస్తుతం కొత్త ఇంట్లోనే వాళ్ళు ఉంటున్నారని లావణ్య తెలిపింది. ప్రస్తుతం అదే ఇంటి ముందు లావణ్య ఆందోళన చేపడుతోంది