ప్రస్తుత తెలంగాణ గవర్నర్ ఇ ఎస్ ఎల్ నర్సింహన్ పదవీ విరమణ చేసిన తర్వాత ఏం చేస్తారు? ఆయన ఏం చేస్తారో బహిరంగంగా చెప్పలేదు కానీ కొందరు టిఆర్ఎస్ అనుకూలురు మాత్రం ప్రభు భక్తితో సోషల్ మీడియాలో ఒక కొత్త ప్రచారం మొదలు పెట్టారు. ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనకు సలహాదారుడి పోస్టు ఇస్తారనేది సోషల్ మీడియా ప్రచారం. కేసీఆర్ అనుకూల మీడియా కూడా దీనికి తగ్గట్టుగానే ఊతం అందిస్తుండటంతో ఇంకే ముంది మన నర్సింహన్ మన దగ్గరే ఉంటారు. ఆయన టిఆర్ఎస్ పార్టీకి కొండంత అండగా ఉంటారు అని కొందరు సంతోష పడుతున్నారు. సత్యం న్యూస్ ఈ విషయం పై దృష్టి సారించగా తేలిందేమిటంటే నర్సింహన్ అలాంటి పదవులేం అంగీకరించే స్థితి లేదు. రాష్ట్ర గవర్నర్ గా సేవలు అందించిన వ్యక్తి సిఎం ఇచ్చే నామినేటెడ్ పదవి చేస్తారంటే నమ్మశక్యంగా లేదు, అసలు ఇలాంటి ప్రచారం ఎందుకు చేస్తున్నారో అని రాజ్ భవన్ వర్గాలు కూడా అంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలో సలహాదారుడిగానో మరొక పోస్టులోనో ఉండాల్సిన అవసరం గవర్నర్ కు లేదు. గవర్నర్ గా పని చేసిన వ్యక్తి నామినేటెడ్ పోస్టుకు రావడమనేది జరగదు. అయితే ప్రభుభక్తి విపరీతంగా ఉన్న ఒక వర్గం మాత్రం పనిగట్టుకుని దీన్ని ప్రచారం చేస్తున్నది. నర్సింహన్ సరిహద్దుల్లో పని చేసిన ఉన్నతాధికారి. ఇంటిలిజెన్సు విభాగంలో పని చేసినందున ఆయనకు అత్యంత ఉన్నత స్థాయి పరిచయాలు ఈనాటికీ ఉన్నాయి. దేశ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కు నర్సింహన్ అత్యంత సన్నిహితుడు. నర్సింహన్ కోరుకుంటే ఆయనకు జాతీయ స్థాయిలోనే ఉన్నత పదవి దక్కుతుంది. అలాంటి వ్యక్తి తెలంగాణ లో నామినేటెడ్ పదవి తీసుకుంటారా అని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
previous post
next post