అసెంబ్లీలో తీర్మానం చేస్తే విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆగుతుందా? విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను ఈ దశలో ఆపడం అసాధ్యం.
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ప్రయత్నాలు చేసి ఉంటే విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను ఆపేందుకు అవకాశం ఉండేది.
విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కాకుండా ముందు నుంచి చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు.
కేంద్రం ఒక్క రోజులో రహస్యంగా చేసిన ప్రక్రియ కాదు.
విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అధికారంలో ఉన్న వారికి తెలియవు అనుకోవడం పొరబాటు.
కేంద్రం ఆ మార్గంలో వెళుతున్నదని తెలిసిన ఉత్తర క్షణంలోనే కార్యరంగంలోకి దిగి ఉంటే బాగుండేది కానీ అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేయలేదు.
విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ తమకు తెలియకుండానే జరిగింది అని అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బుకాయిస్తే అది వారి పాలనా వైఫలం కిందికే వస్తుంది తప్ప మరొకటి కాదు.
విశాఖ ఉక్కును ప్రయివేటు పరం చేయడంపై రెండో వాదన పైకి తీసుకురావడంలో చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు.
ప్రయివేటీకరణ చేయడం తప్ప గత్యంతరం లేదని కొందరు పెద్దలు పదే పదే చెబుతుండటంతో విశాఖపట్నంలో ఉక్కు ఉద్యమం రోజు రోజుకు నీరుగారి పోతున్నది.
ఇందులో ఒకరో ఇద్దరో కాదు చాలా మంది, చాలా పెద్ద శక్తులు పాత్ర పోషిస్తున్నాయి.
పైగా ఆంధ్రప్రదేశ్ లో ఏక తాటిపైకి వచ్చి పోరాటం చేసే బలమైన రాజకీయ పార్టీలు లేవు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నవన్నీ అవకాశ వాద రాజకీయ పార్టీలే.
అందుకే విశాఖ ఉక్కు పై చేసే ప్రజా పోరాటం ఫలించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేసినా, తెలుగుదేశం పార్టీ నిరాహార దీక్ష చేసినా కేవలం విశాఖ పట్నం మునిసిపల్ ఎన్నికల కోసమే తప్ప విశాఖ ఉక్కు కోసం కాదు.
ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దల పాదాలకు నమస్కారం చేసి వచ్చే రాజకీయ పార్టీలు విశాఖ ఉక్కుపై కేంద్రం మెడలు వంచుతాయని ఆశించడం తప్పే అవుతుంది.