జీహచ్ఎంసి ఎన్నికల ప్రకటన వెలువడగానే అన్ని పార్టీలూ చక చకా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు ఎన్నికల కోసం కమిటీలు వేసుకుని ముందుకు వెళుతున్నాయి. తెలుగుదేశం పార్టీ, జన సేన పార్టీలు తాము పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి.
ఈ మేరకు ఏర్పాట్లు కూడా మొదలు పెట్టాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసి ఎన్నికలలో స్వతంత్రంగా పోటీ చేస్తుందా లేదా అనే విషయం వెల్లడి కాలేదు. స్వంతంగా పోటీ చేయకపోతే టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తుందా?
లేకపోతే జాతీయ పార్టీ అయిన బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నందున బీజేపీకి మద్దతు ప్రకటిస్తుందా అనేది హైదరాబాద్ లోని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అర్ధం కావడం లేదు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి, మజ్లీస్ పార్టీల మధ్య జీహెచ్ఎంసిలో హోరా హోరీ పోరు జరగబోతున్నది.
మిగిలిన ఏ పార్టీ పోటీ చేసినా నామమాత్రమే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి జీహెచ్ ఎంసి ఏరియాలో బలమైన నాయకులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానులు ఎంతో మంది ఉన్నారు. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే చాలా స్థానాలలో బలమైన పోటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జీహెచ్ ఎంసిలో సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్థానాలను గెలిచే అవకాశం కూడా ఉంది. ఇలాంటి మంచి అవకాశాన్ని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వదలుకుంటారా అనే ప్రశ్న తలెత్తుతుతన్నది. తమకు ఎంతో సన్నిహితంగా ఉన్న టీఆర్ఎస్, మజ్లీస్ పార్టీలకు జగన్ మేలు చేయాలని అనుకుంటున్నా అనే విషయం కూడా స్పష్టం కాలేదు.
కొన్ని చోట్ల పోటీ చేయడం ద్వారా సెటిలర్ల ఓట్లను గణనీయంగా చీల్చి కాంగ్రెస్, బిజెపిలకు తీరని నష్టం చేకూర్చవచ్చు. తద్వారా మితులైన కేసీఆర్ కు, ఒవైసీకి మేలు చేయవచ్చు. అయితే ఏ విషయం ఇప్పటి వరకూ వెల్లడి చేయకపోవడంతో జీహెచ్ఎంసి పరిధిలోని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానులు పార్టీ ఆదేశాల కోసం వేచి ఉన్నారు.