ఉమ్మడి కడప జిల్లా సిద్దవటం మండలకేంద్రమైన సిద్దవటం ఎగువపేటలోని ఒకటవ సెంటర్,ఎస్. రాజంపేట గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను సోమవారం రాష్ట్ర ఉమెన్స్ కమిషన్ సభ్యురాలు గజ్జెల లక్ష్మీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కిషోర బాలికలకు బాల్యవివాహాలు చేసుకుంటే జరిగే నష్టాల గురించి అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. బహిష్ఠు సమయంలో కిషోర బాలికలు, మహిళలు పాటించాల్సిన పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. బాలింతలు పుట్టిన పిల్లల నుంచి 6 నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలని తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరమన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యనభ్యసించే ప్రీ స్కూల్ విద్యార్థుల్లో మేధోసంపత్తిని పెంపొందించాలని కార్యకర్తలకు సూచించామన్నారు.
ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికారాన్ని గర్భవతులకు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని రిజిస్టర్లు, పౌష్టికారం స్టాకు, పాలు, గుడ్లు, వైఎస్ఆర్ కిట్టు నాణ్యతను, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. గర్భవతులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం తీసుకుంటున్నారా? లేదా? తల్లులను అడిగి తెలుసుకున్నారు.అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న విద్యార్థుల చేత బోర్డుపై వున్న పదాలను, అక్షరాలు పలికించి వారి సామార్థ్యాన్ని పరీక్షించారు. ఈ కార్యక్రమంలో ఐసీడియస్ సీడిపిఓ శ్రీదేవి, సూపర్వైజర్ జెహరాబీ, కార్యకర్తలు పాల్గొన్నారు.