ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపులు తెరవడాన్ని మహిళలు వ్యతిరేకించడం లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అబ్కారీ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కె.నారాయణస్వామి అన్నారు. పనిగట్టుకుని ఎవరో రెచ్చగొడితే వచ్చిన కొందరు మహిళలు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకే మద్యం విక్రయాలకు ఆంధ్రప్రదేశ్ లో అనుమతులిచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. సచివాలయం నాల్గవ బ్లాక్ లోని తన కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి కె. నారాయణస్వామి మాట్లాడారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరిచినట్లే రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మద్యం షాపులు తెరిచేందుకు అనుమతులు ఇచ్చామన్నారు.
ఈ అంశంపై కొందరు చేస్తున్న విమర్శలు అర్థరహితం అన్నారు. రాష్ట్రంలో మద్యం షాపులు తెరిచే అంశంలో కొందరు మహిళల నుండి వ్యక్తమవుతున్న ఆందోళనలు ఎంతమాత్రం నిజంకాదన్నారు. వారంతా కొందరు పనిగట్టుకొని రెచ్చగొడుతున్న వ్యక్తులే అని ఆరోపించారు. రేటు పెంచడం వల్ల పేదవారు ఆ రేటుకు భయపడి తాగడం మానేస్తారని ఆయన కొత్త విషయం చెప్పారు.