మహిళల రక్షణ ప్రధాన లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ ఆధునిక సౌకర్యాలతో దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిందని నల్లగొండ జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ అన్నారు. శుక్రవారం ఎం.టి. ఇన్స్ పెక్టర్ స్పర్జన్ రాజ్ నేతృత్వంలో జిల్లా అదనపు ఎస్పీ నర్మద, డిటిసి అదనపు ఎస్పీ సతీష్ చోడగిరితో కలిసి షీ టీమ్ పోలీస్ సిబ్బందికి కేటాయించిన 20 వాహనాలను డిఐజి రంగనాధ్ జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల రక్షణ విషయంలో రాజీ లేకుండా పని చేస్తూ ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులు, మహిళల పట్ల దాడుల లాంటి నేరాల సంఖ్యను తగ్గించే విధంగా సమర్ధవంతంగా పని చేస్తున్నామని తెలిపారు.
మహిళల రక్షణ విషయంలో తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్ర స్థానంలో ఉన్నదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు తొలి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అందుకు అవసరమైన రీతిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సౌకర్యాలు కల్పిస్తోందన్నారు.
మహిళా పోలీస్ అధికారులకు కేటాయించిన ఈ వాహనాల ద్వారా ఇకపై మహిళల రక్షణకు సంబంధించి సంఘటనా స్థలాలకు మరింత త్వరగా చేరుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. పోలీస్ సిబ్బంది సైతం ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సమర్ధవంతంగా వినియోగించుకుంటూ ప్రజలు, మహిళల రక్షణ కోసం చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు.
జిల్లాలో మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ నిరంతర నిఘాతో పాటు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తూ వారిని చైతన్యం చేస్తున్నామని తెలిపారు. అదనపు ఎస్పీ నర్మద మాట్లాడుతూ మహిళా పోలీస్ అధికారులు, షీ టీమ్స్ సిబ్బందికి కేటాయించిన వాహనాల ద్వారా ఘటనా స్థలాలకు త్వరితంగా చేరుకోవడం, దాడులు అరికట్టే విధంగా సమర్ధవంతంగా సేవలందించవచ్చని చెప్పారు.
తెలంగాణ పోలీస్ శాఖ మహిళా రక్షణ విషయంలో అత్యధిక శ్రద్ధ వహిస్తూ తీసుకుంటున్న చర్యలు అందరి ప్రశంసలందుకుంటున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎం.టి. ఇన్స్ పెక్టర్ స్పర్జన్ రాజ్, ఆర్.ఐ. వై.వి. ప్రతాప్, సిఐలు సురేష్, బాషా, ఎం.టి. సిబ్బంది లియాఖత్, తదితరులు పాల్గొన్నారు.