కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అన్ లాక్ -4 మార్గదర్శకాలను సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ గురుకుల విద్యా సంస్థల్లో కూడా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ (TSPTA)రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన జిఓ 120 లోని ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర విద్యాశాఖ ఈనెల 20 వరకు వర్క్ ఫ్రం హోం, 21 నుండి 50% సిబ్బంది మాత్రమే పాఠశాలలకు హాజరు కావాలని పేర్కొంటూ మెమో నెంబర్ 3552 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.
కానీ గురుకుల విద్యా సంస్థల్లో ఆ ఉత్తర్వులు అమలు చేయటం లేదని సంబంధిత ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఆన్లైన్ క్లాసులు తీసుకుంటూ, గ్రామీణ అభ్యసనా కేంద్రాలను పర్యవేక్షిస్తూ విద్యార్థులకు విద్యనందించేందుకు గురుకుల ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు.
ఇంకా సొసైటీ ఆదేశాల మేరకు ఆగస్టు 29 నుండి పాఠశాలలకు హాజరౌతున్నారు. ఈ క్రమంలో పలువురు కోవిడ్ బారిన పడ్డారు. మొత్తం ఉపాధ్యాయుల్లో భయానక వాతావరణం ఏర్పడింది. కోవిడ్ పాజిటివ్ వచ్చి క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్న వారికి కనీసం ప్రత్యేక సెలవులు కూడా ఇవ్వడం లేదు.
కాంట్రాక్టు ఉపాధ్యాయులు, కొత్తగా సర్వీసులో చేరిన ఉపాధ్యాయులకు అర్హత గల సెలవులు లేకపోవడంతో వేతనాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని టిఎస్పిటిఎ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, రోహిత్ రాథోడ్ ఆవేదన వ్యక్తంచేశారు.
కోవిడ్ తీవ్రంగా వ్యాపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా ఒక్కొక్క యాజమాన్యం ఒక్కో రకంగా ఆదేశాలు ఇవ్వటం సమంజసం కాదని వారు స్పష్టంచేశారు.