ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా నేడు హనుమకొండ లోని రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో అనురాగ్ హెల్పింగ్ సొసైటి ప్రెసిడెంట్, మాజి సిడబ్ల్యుసి చైర్ పర్సన్ డా. కె.అనితారెడ్డి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానం అని అన్నారు.
ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. గత 20 సంవత్సరాలుగా సంవత్సరానికి 3 సార్లు తాను రక్తదానం చేస్తున్నానని ఆమె తెలిపారు. ఎన్నో రక్తదాన శిబిరాలు నిర్వహించి, రక్తదానంపై ఎన్నో అవగాహనా సదస్సులు నిర్వహించానని ఆమె వెల్లడించారు.
మనం చేసి చూపించినప్పుడే అందరికి ఆదర్శంగా నిలుస్తామని అనితా రెడ్డి అన్నారు. రక్తం కొరతతో ఎంతో మంది చనిపోతున్నారని దానిని నివారించడానికి ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకురావాలని అనితా రెడ్డి కోరారు.