భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ ను ఆగస్టు 15 నాటికి తీసుకువస్తున్నదనే వార్త దావానలంలా వ్యాపించింది. ఆగస్టు 15 నాటికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన కరోనా వ్యాక్సిన్ ను మార్కెట్లోకి విడుదల చేస్తామని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్), భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.
క్రియారహిత వైరస్ ఆధారిత ఈ వ్యాక్సిన్, జంతువుల్లో పూర్తి సత్ఫలితాలను ఇవ్వగా, నేడో, రేపో మానవులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయని వారు వెల్లడించారు. క్లినికల్ ట్రయల్స్ కోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని 12 ఇనిస్టిట్యూట్ లను ఐసీఎంఆర్ ఎంపిక చేసింది.
ఈ కేంద్రాల్లో వ్యాక్సిన్ పనితీరును పరిశీలిస్తామని, అన్ని క్లినికల్ ట్రయల్స్ ఆగస్టు తొలివారం నాటికి పూర్తవుతాయని తెలియజేశాయి. అయితే దీనికి సంబంధించి భారత్ బయోటెక్ కు సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి కె శ్రీనివాసన్ తొలి వ్యాక్సిన్ డోస్ ను తీసుకుంటున్నారని, కరోనా వైరస్ డోస్ ను తొలి సారిగా తీసుకుంటున్న వ్యక్తి ఆయనేనని పలు రకాలుగా ఫొటోలతో సహా ప్రచారం జరిగింది.
వి కె శ్రీనివాసన్ వ్యాక్సిన్ తీసుకోవడం అనేది కరెక్టు కాదు. అలా వ్యాక్సిన్ ను ఎవరూ తీసుకోరు. క్లినికల్ ట్రయల్స్ జరగడానికి వాటి ఫలితాలు నిర్ధారించడానికి సమయం పడుతుంది. ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ రాకపోవచ్చునని కంపెనీ వర్గాలు తెలిపారు.