రాజకీయ ముసుగులో ఉన్న మిల్లర్ల చేతిలో వై ఎస్ జగన్ ప్రభుత్వం కీలుబొమ్మగామారి, రైతులకు అన్యాయం చేస్తోందని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ యస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
పౌరసరఫరాల శాఖ రబీ పంటకు సంబంధించి 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటున్నాం అన్నారని, నేటికి కేవలం 25,25,972 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే కొనుగోలు చేసారని ఆయన తెలిపారు.
ప్రభుత్వం రైతులందరు మద్ధతు ధరకు తమ ధాన్యాన్ని అమ్ముకోవాలంటారని అయితే అందుకు అవకాశం లేకుండా పోతున్నదని ఆయన అన్నారు.
రైతుల ధాన్యానికి చెల్లించాల్సిన బకాయిలు పౌరసరఫరాల శాఖ ఎందుకు చెల్లించడం లేదు. ప్రభుత్వ చర్య పరోక్షంగా మిల్లర్లకు- దళారులు సహకరించడం కాదా? అని ఆయన ప్రశ్నించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కేవలం గుడివాడకు మాత్రమే మంత్రా?? లేక రాష్ట్రానికి మంత్రో తెలియడం లేదని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
పెన్షన్ల పంపిణీకి సంబంధించిన సమాచారం ,ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రతి నెల మొదటి వారంలో గంట గంటకు చెప్పే ప్రభుత్వం, రైతులు ధాన్యం కొనుగోలు సమాచారం ఎందుకు ప్రతి రోజు రైతులకు చెప్పడంలేదు? అంటూ ఆయన ప్రశ్నించారు.