గత మూడు నెలల నుండి పౌరసత్వ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తూ ఉందని జాయింట్ యాక్షన్ కమిటీ నాయకుడు ఫారూఖ్ షిబ్లీ అన్నారు. భారతదేశ రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఫారూఖ్ షిబ్లీ మాట్లాడారు.
గత రెండు రోజుల నుంచి మాత్రం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లింలపై ప్రేమ ఒలకబోస్తున్నారని షిబ్లీ అన్నారు. ఇది కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసమేనని ఆయన వివరించారు. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ పై మంత్రి వర్గం లో నిర్ణయం తీసుకోవడం 2010 ప్రశ్నావళి ప్రకారమే నిర్వహించాలని కేంద్రాన్నికోరడం అంతా నాటకమేనని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి మాత్రమే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విధంగా నాటకాలు ఆడుతున్నారని షిబ్లీ అన్నారు.