రాజధాని అమరావతి తరలింపు చేసేస్తున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ మేరకు ఆయన మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో సంబంధిత అధికారులు పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ, కౌన్సిల్ నడుస్తున్నాయి. కౌన్సిల్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన భావిస్తున్నారు. కేవలం రాజకీయ పునరావాసం కోసం మాత్రమే కౌన్సిల్ ఉపయోగపడుతున్నదని, ఈ దశలో లెజిస్లేటీవ్ కౌన్సిల్ అవసరం లేదని ఆయన అనుకుంటున్నారు.
ఈ మేరకు ఆయన నిర్ణయం తీసుకుని న్యాయ శాఖకు ఆదేశాలు పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. న్యాయ శాఖ అన్ని అంశాలను పరిశీలించి కౌన్సిల్ రద్దుకు బిల్లును రూపొందించాల్సి ఉంటుంది. న్యాయ శాఖ బిల్లును రూపొందించిన తర్వాత దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అసెంబ్లీ ఆ బిల్లును ఆమోదించిన తర్వాత రాష్ట్ర పతి ఉత్తర్వుల మేరకు కౌన్సిల్ ను రద్దు చేస్తారు. కౌన్సిల్ రద్దు అయిపోతే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజకీయంగా కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది. సిఆర్ డిఏ బిల్లుతో చంద్రబాబును దెబ్బ కొట్టిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కౌన్సిల్ రద్దుతో ఆయన కుమారుడు లోకేష్ కు రాజకీయంగా చెక్ పెడతారు.