ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి కేసులో మరో కీలక మలుపు ఇది. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత తన తండ్రి హత్య కేసు విచారణ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె చొరవతోనే సీబీఐ విచారణ కొనసాగుతున్నది. ఇప్పటికే సీబీఐ ఒక చార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ దాఖలు చేసిన చార్జి షీట్ లో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కడప ఎంపి అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావన కూడా ఉన్నది.
అయితే ఈ దశలో కొందరు ఈ హత్యకు కారణం వై ఎస్ సునీత భర్తేనని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వై ఎస్ సునీత లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తన తండ్రి హత్య కేసులో ఎంపీ అవినాష్ హస్తం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని స్పీకర్ను సునీత కోరారు. సీబీఐకి తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని లేఖకు జతపరిచారు. అలాగే సీబీఐకి నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను కూడా స్పీకర్కు వైఎస్ సునీత అందజేశారు. దీనిపై విచారణకు లోక్ సభ స్పీకర్ చర్యలు తీసుకుంటే మరిన్ని పరిణామాలు సంభవించే అవకాశం ఉంది.