ముందుగా ఊహించినట్లుగానే, సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్లుగానే వై ఎస్ విజయలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగారు. ఆ పార్టీ గౌరవాధ్యక్ష పదవి నుంచి వైదొలగుతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో ప్రకటించారు. గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ సమీపంలో జరుగుతున్న ప్లీనరీ సమావేశంలో ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
వై ఎస్ జగన్ కష్టాలలో ఉన్నప్పుడు తాను అండగా ఉన్నానని, ఇప్పుడు తన కూతురు షర్మిల కష్టాలలో ఉన్నందున ఆమె తెలంగాణ లో స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. తన కుమార్తె అక్కడ పార్టీ పెట్టి ప్రచారం చేస్తున్నందున ఇంకా జగన్ తో ఉండాల్సిన అవసరం లేదని తాను భావిస్తున్నట్లు విజయలక్ష్మి తెలిపారు.
అందుకే పార్టీ నుంచి వైదొలగుతున్నట్లు ఆమె ప్రకటించారు. తాను రాజీనామా చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని అది తప్పు అని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. తన సంతకం కూడా పెట్టి మరీ సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను మహిళ అని కూడా చూడకుండా తన పై అవాస్తవాలు ప్రచారం చేశారని విజయలక్ష్మి తెలిపారు.