దేవాలయాలకు సంబంధించిన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం మింగేస్తున్నదని, అధర్మ పాలన సాగిస్తున్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి గతంలో చేసిన ప్రకటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది.
తెలుగుదేశం ప్రభుత్వం అధర్మ పాలన చేస్తున్నదని, దేవుడి భూములు అమ్మేస్తున్నదని ఆయన ఆ వీడియోలో పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలాంటి కార్యక్రమాలు జరగవని ఆయన అప్పటిలో చెప్పారు. దేవుడి భూములను అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అని ఆయన ఆ నాడు సూటిగా ప్రశ్నించారు. దేవుడి సొమ్మునే మింగేయాలని దేవుళ్లనే మింగేయాలని చూస్తున్న అధర్మ పాలన ఇది అని ఆయన ధ్వజమెత్తారు.
దైవ కార్యక్రమాల పేరు చెప్పి కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ అధర్మ పాలన మనల్ని మింగేసే కాడికి వచ్చింది. ఇలాంటి ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన రోజు వచ్చింది అని ఆయన అప్పుడు పిలుపునిచ్చారు.
వై వీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలోని తిరుమల తిరుపతి దేవస్థానం నిరర్ధక ఆస్తుల పేరుతో కొన్ని భూములను అమ్మేయాలని చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఈ వీడియోను సామాజిక మాధ్యమాలలో విడుదల చేశారు.