విశాఖ శ్రీ శారదా పీఠం లో పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి , పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వార్ల ఆధ్వర్యంలో విషజ్వరపీడ హరయాగం , అమృత పాశుపత యాగం బుధవారం ఘనంగా ప్రారంభమైంది.
దేశ ప్రజలు , ప్రపంచం యావత్తు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని కాంక్షిస్తూ శ్రీ శారదా పీఠం ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విషజ్వరపీడ హర, అమ్మత పాశుపత యాగం 11 రోజుల పాటు ఋత్వికుల ఆధ్వర్యంలో జరుగుతుంది.
యాగ ప్రారంభం సందర్భంగా పీఠం ఉత్తరాదికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ మాట్లాడుతూ ప్రస్తుతం భారత దేశ గ్రహ మైత్రేయి సరిగా లేనందున అటువంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయని అన్నారు . భారతదేశ జన్మ రాశి ధనురాశిలో గురుడు, కుజుడు, కేతువు మూడు గ్రహాల కలయిక, రెండు దున్న గ్రహాలతో గురు గ్రహ వీక్షణ వల్ల దేశంలో ఆరోగ్య పరమైన సమస్యలు సంభవిస్తాయని జ్యోతిష్య శాస్త్రంలో స్పష్టంగా ఉంది.
మార్చి 23 నుంచి కుజుడు మకర రాశిలో శనితో కలిసి ఉండటం వల్ల ఇటువంటి పరిస్థితులు సంభవిస్తున్నాయని అన్నారు. ఏప్రిల్ 2 నుంచి మే 10 వరకు దేశానికి కాలసర్పదోషం ఉంది. ఈ పరిస్థితుల్లో దైవానుగ్రహ కార్యక్రమాలతో విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని అన్నారు.
విషజ్వరపీడ హర, అమృత పాశుపత యాగం 11 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. ఔదుంబర ( మేడి ) వృక్ష సమిదులు, సుగంధ ద్రవ్యాలు, వనమూలికలు, గోమయంతో చేసిన పిడకలు ఈ యాగంలో ఉపయోగిస్తున్నట్టు తెలిపారు.
ఈ యాగధూళి ప్రజలకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుందని తెలిపారు. ఋగ్వేదం, అధర్వణ వేదాల్లోని ఆరోగ్య మంత్రాలు, యోగవాశిష్టంలోని బీజాక్షరాలను సంపుటి చేసి ఋత్వికులు ఈ యాగం నిర్వహిస్తారన్నారు. దేశం సుభిక్షంగా , ప్రజలంతా ఆరోగ్యంగా సుఖసంతోషాలతో ఉండాలనే ఆకాంక్షతో పూజ్య స్వామి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులుతో యాగం నిర్వహిస్తున్నట్టు స్వాత్మానందేంద్ర తెలిపారు.