తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పై జరుగుతున్న మారణకాండను వెంటనే ఆపాలని గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఈ సంవత్సర కాలంలో దాదాపు 42 మందిని కాళ్లు, చేతులు విరగ్గొట్టి ఎందుకూ పనికి రాకుండా చేశారని ఆయన అన్నారు.
వైసీపీ నాయకుల ఆగడాలు నిలువరించాల్సిన పోలీసులు చోద్యం చూస్తూ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు. స్థానిక ఎస్ఐ, వైసీపీ నాయకులకు వత్తాసు పలుకుతూ తెలుగుదేశం నాయకులపై దాడులు చేయిస్తున్నాడు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఈ మారణకాండను ఆపి తెలుగుదేశం వర్గాలకూ రక్షణ కల్పించాలి అని ఆయన డిమాండ్ చేశారు.
అదే కాకుండా నియోజకవర్గంలో దాదాపు 10 గ్రామాల్లో ఇంకా తెలుగుదేశం కార్యకర్తలు గ్రామం వదిలిపెట్టి బయట గ్రామాల్లో నివసిస్తున్నారు. వాళ్ళు గ్రామాలకూ తిరిగి వచ్చే పరిస్థితులు కూడా లేవు. వెంటనే వాళ్ళను వారి గ్రామాలకూ తీసుకువచ్చి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. జిల్లా ఎస్పీదీనిపై వెంటనే స్పందించాలి అని ఆయన కోరారు.
వైసీపీ నాయకుల అక్రమాలకు అడ్డులేదా?
నియోజకవర్గంలో వైసీపీ నాయకులు బరితెగించి అక్రమ మైనింగ్, అక్రమ మద్యం,గుట్కా, గంజాయి పేకాట క్లబ్బులు, ఇసుక వ్యాపారం మట్టి వ్యాపారం అడ్డగోలుగా చేస్తూ ఉన్నారని యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. నాలుగు మండలాల్లో వైసిపి పార్టీ కి చెందిన రెస్టారెంట్లలో విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతున్న సంగతి పోలీసులకు, ఎక్సైజ్ శాఖ వారికి తెలియదా?
నియోజకవర్గంలో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్న మద్యాన్ని తిరిగి వైసీపీ నాయకులకు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మీరు ఇప్పటివరకు ఎంత మద్యాన్ని పట్టుకున్నారో, ఆ మద్యం ఎక్కడ ఉన్నదో, ఎలాంటి క్వాలిటీ మధ్యాన్ని పట్టుకున్నారో వివరాలు చెప్పవలసిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు.