ప్రధాని నరేంద్ర మోడీ తాము చెప్పిన ప్రతిదీ చేస్తున్నట్లు వైసీపీ నేతలు మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా చట్టంగా తీసుకువచ్చి అమలు చేయించాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు.
తాము సలహా ఇవ్వడం వల్లే కేంద్రంలోని మోడీ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నాడని వైసీపీ నేతలు నిన్నటి నుంచి ఎంతో గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని ఆమె అన్నారు.
ఈ నేపథ్యంలోనే దేశంలో మహిళా బిల్లును కూడా అమలు చేయించాలని ఆమె వైసీపీ నేతలకు సూచించారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మహిళా సాధికారతకు తూట్లు పొడిచిందని ఆమె అన్నారు. మహిళ బిల్లుపై గత ప్రభుత్వం అన్యాయం చేసిందని తాము అధికారంలోకి వస్తే బిల్లును పాస్ చేస్తామని బిజెపి నేతలు గతంలో చెప్పారని ఆమె గుర్తు చేశారు.
ఏడేళ్లయినా అతీగతీ లేదని ఆమె తెలిపారు. బీజేపీకి లోక్ సభలో సంపూర్ణ మెజార్టీ ఉంది, రాజ్యసభలో మహిళ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి బీజేపీ అధికారంలోకి వచ్చి దాదాపు 7 సంవత్సరాలు అవుతున్నా మహిళా బిల్లుపై నోరు విప్పడం లేదు అని ఆమె అన్నారు.