రాజధాని ఉద్యమాన్ని నీరుగార్చేందుకు వైసీపీ కుట్ర పన్ని రాజధాని ప్రాంతానికి ఎటువంటి సంబంధం లేని నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుని పావుగా వాడుకుంటున్నదని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. నేడు ఆయన నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్యమంలో పాల్గొన్న మహిళలను పోలీసులు తీవ్రంగా హింసించడమే కాక అరెస్టు చేసినప్పుడు ఈ ఎంపీ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు.
కరకట్ట కమల్ హాసన్ మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రాజధాని రైతులను ఎందుకు పరామర్శించే లేదు అని ప్రశ్నించారు. వైసిపి మంత్రులు నాయకులు రైతులను పెయిడ్ ఆర్టిస్టులు గా అభివర్ణించారు కదా అక్కడ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైనా కనపడ్డారు లేదో ప్రజలకు ఎంపీ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. టిడిపి కార్యాలయాల ముట్టడి, ఎమ్మెల్యేలను అడ్డుకోవడం లాంటి చర్యలకు వైసీపీ కార్యకర్తలు పాల్పడుతుంటే రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ నిద్రపోతున్నారా అని ఆయన ప్రశ్నించారు.
విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి ,గుంటూరులో సజ్జల రామకృష్ణారెడ్డి అనధికార హోం మంత్రులుగా వ్యవహరిస్తూ వైసిపి కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. ఒక పార్టీ కార్యాలయంపై మరో పార్టీ కార్యకర్తలు దాడులు చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదివరకు ఎప్పుడూ జరగలేదని, వైసిపి కార్యకర్తలు చంద్రబాబు దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహిస్తూ తగలబెడుతుంటే పోలీసులు వారికి భద్రత కల్పించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
దళిత నేత సీనియర్ పార్లమెంటు మాజీ సభ్యులు జి.వి.హర్షకుమార్ పై ప్రభుత్వ తప్పుడు కేసులు నమోదు చేసి 45 రోజుల పాటు జైల్లో ఉంచారంటే దళితులపై ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వేల్పుల సింహాద్రి యాదవ్, జిల్లా కార్యదర్శి ఇమిడిశెట్టి కాశయ్య పాల్గొన్నారు.