బద్వేలు ఉప ఎన్నిక కు వైసిపి భయపడుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ అన్నారు. కమలాపురంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అక్టోబర్ 30న బద్వేలు శాసనసభ స్థానానికి జగనన్న ఉపఎన్నికకు సంబంధించి అప్పుడే అధికార పార్టీలో అంతర్మధనం ప్రారంభమైనట్లు కన పడుతోందన్నారు. ఇంకా ఎన్నికల వేడి పూర్తిస్థాయిలో రగలక ముందే ముగ్గురు క్యాబినెట్ మంత్రులను, ఏడుగురు ఎమ్మెల్యేలను ఎన్నికల పర్యవేక్షణకు నియమించుకోవడం చూస్తే అధికారపార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటాలకు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణను చూసి ఈ ఎన్నికల్లో కొంతవరకైనా అధికార పార్టీ తమ పరువు నిలుపు కోవడానికి ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు కనపడుతోందన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన పై సామాన్యప్రజలలో సైతం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తీరు, ప్రజలు తెలుగుదేశం పట్ల, చంద్రబాబు నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితుల వల్ల బద్వేల్ నియోజకవర్గ ప్రజలను అధికార బూచి అడ్డుపెట్టి, మభ్యపెట్టి ఓట్లు రాబట్టుకోవడానికి, ముగ్గురు క్యాబినెట్ స్థాయీ మంత్రులను ఎన్నిక ఇంఛార్జి లుగా నియమించుకొందన్నారు.
అధికార పార్టీ ధనబలం, పోలీసు బలం, అధికార దర్పంతో బద్వేల్ నియోజకవర్గ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే ప్రజలు తగిన విధంగా బుద్ధిచెపుతారన్నారు. అలాగే ఈ ఎన్నికకు ఇన్ చార్జులుగా నియమింపబడిన మంత్రులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్నారు.ఇంఛార్జి లుగా నియమింపబడిన మంత్రులుకు ఈ ఎన్నిక అయేపోయెంత వరకు క్యాబినెట్ స్థాయి ని ఎన్నికల కమిషన్ తొలగించాలని కోరారు. బద్వేలు ఉప ఎన్నికలలో తెలుగుదేశం విజయ ఢంకా మోగిస్తుందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో టీడీపీ జిల్లా మీడియా కో ఆర్డినేటర్ జనార్దన్, జిల్లా కార్యదర్శి యాటగిరి రామ్ ప్రసాద్ లు పాల్గొన్నారు.