పటిష్టంగా ఉందనుకున్న వైసీపీ పార్టీ నుంచి బయటకు తొంగి చూస్తున్న నాయకుల సంఖ్య పెరిగిపోతున్నది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావు తాజాగా ఈ జాబితాలో చేరారు. ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్తో నిన్న భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం కలిగిస్తున్నది. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ రాష్ట్ర మాజీ సలహాదారు అయిన రాజేశ్వరరావు నిన్న హైదరాబాద్లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్తో భేటీ అయ్యారు.
2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన రాజేశ్వరరావు ఓటమి పాలయ్యారు. గత కొంతకాలంగా ఆయన వైసీపీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్తో ఆయన భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. త్వరలోనే ఆయన జనసేన పార్టీలో చేరతారనే ఊహగానాలు కూడా వినిపిస్తున్నాయి.
గత ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకుని జనసేన పార్టీ అభ్యర్ధి గెలిచిన ఏకైక అసెంబ్లీ స్థానం రాజోలు. జనసేన తరపున గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అనధికారికంగా పార్టీ ఫిరాయించి అధికార వైసీపీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. వైసీపీలో రాపాకకు ప్రాధాన్యం పెరగడంతో ఆ పార్టీ నేతలు పక్కదారి పడుతున్నారు. మరోవైపు ఇప్పటికే కీలక నేతలు కొందరు ప్రతిపక్ష పార్టీల్లోకి చేరగా ఇప్పుడు మరో వికెట్ డౌన్ అంటున్నారు. అదే జరిగితే వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి. రాజేశ్వరరావుకు రాజోలులో మంచి పట్టు ఉంది. వైసీపికి చెందిన బలమైన కేడర్ అంతా ఆయన వెంటే ఉంది.