చెక్ బౌన్స్ కేసులో అరెస్టు చేయడానికి వచ్చిన తెలంగాణ పోలీసులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకరు దౌర్జన్యం చేసిన సంఘటన ఒంగోలులో జరిగింది. ఈ సంఘటనపై తెలంగాణ పోలీసులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు పోటీ ఫిర్యాదులు ఇచ్చారు.
వైసీపీ యువజన విభాగం నగర అధ్యక్షుడు గంటా రామానాయుడు భార్య రమ్యశ్రీపై రాష్ట్రం హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్బోర్డు లో చెక్ బౌన్స్ కేసు నమోదు అయి ఉంది. ఈ కేసులో అరెస్టు వారెంట్ ఉండటంతో తెలంగాణ కు చెందిన పోలీసులు ఒంగోలుకు చేరుకున్నారు.
ఒక మహిళా కానిస్టేబుల్తో పాటు మరో పోలీసు ఒంగోలు వచ్చారు. లాయర్పేటలోని రామానా యుడు ఇంటికి వెళ్లి అతని భార్య రమ్యశ్రీని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన విషయాన్ని స్థానిక పోలీసులకు తెలిపేందుకు వన్టౌన్ పోలీసుస్టేషన్కు ఆమెను తెలంగాణ పోలీసులు తమ వాహనంలో తీసుకెళ్లారు.
విషయం తెలిసి రామానాయుడు బంధువులు, వైసీపీ నేత సింగరాజు రాంబాబు తదితరులు స్టేషన్కు చేరుకున్నారు. తెలంగాణ పోలీసులపై దౌర్జన్యం చేసి రమ్యశ్రీని కారు దింపి తమ వాహనంలో తీసుకెళ్లారు. ఆ సమయంలో వన్టౌన్ సీఐ సీతారామయ్యతోపాటు ఇతర పోలీసులు బయటకు వచ్చి ఘటనను చూస్తూ ఉండిపోయారు.
ఒంగోలు వన్టౌన్ వద్ద ఏడు గంటలపాటు హైడ్రామా చోటుచేసుకుంది. అధికార వైసీపీ నాయకుల హడావుడితో ఉద్రిక్తత నెలకొంది. వన్టౌన్ స్టేషన్ ఎదుటే వైస్సార్ పార్టీ నేత హడావుడి చేసి వారి అదుపులో ఉన్న మహిళను బలవంతంగా ఎత్తుకెళ్లారు. స్థానిక పోలీసులు చోద్యం చూశారు తప్ప జోక్యం చేసుకోలేదు.
తెలంగాణ పోలీసులకు సహకరించని ఏపీ పోలీసులు
పైగా కూకట్ పల్లి పోలీసులను, వైసీపీ నాయకులను కలిపి కూర్చోబెట్టి రాజీ కుదుర్చేందుకు స్థానిక పోలీసులు ప్రయత్నించారు కూడా. తాము ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు దర్యాప్తులో భాగంగా వచ్చామని కూకట్ పల్లి పోలీసులు స్పష్టం చేశారు. తెలంగాణ పోలీసులకు సాయం చేసి నిందితులను పట్టివ్వాల్సిన స్థానిక పోలీసులు రాజీ కుదుర్చేందుకు ప్రయత్నించడం పై కూడా విమర్శలు వస్తున్నాయి.
తమపై వైసీపీ నేతలు సింగరాజు రాంబాబు, గంటా రామానాయుడు, వసంతతో పాటు మరికొంతమంది దౌర్జన్యం చేసి రమ్యశ్రీని బలవంతంగా ఎత్తుకెళ్లారని తెలంగాణ పోలీసులు పేర్కొన్నారు. తెలంగాణ నుంచి వచ్చిన పోలీసులపై సీఐ సీతారామయ్యకు వైసీపీ నేతలు, బంధువులపై ఫిర్యాదు చేశారు. ఈమేరకు రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు సీఐ సీతారామయ్య తెలిపారు.