ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య చేసులో సీబీఐ విచారణ జోరుగా సాగుతున్నది. కడప కేంద్ర కారాగార అతిథి గృహం, పులివెందుల ఆర్.అండ్.బి అతిథి గృహం కేంద్రాలుగా 68వ రోజు విచారణ కొనసాగింది.
నేడు వైద్యులు భరత్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. భరత్ యాదవ్, సునీల్ యాదవ్ తల్లి సావిత్రమ్మ, భార్య కడప కేంద్ర కారాగార అతిథి గృహంలో మరో సీబీఐ బృందం ఎదుట విచారణకు హాజరయ్యారు. నిన్న మాజీ డైవర్ దస్తగిరి, చెప్పుల వ్యాపారి మున్నా, ఈసీ గంగిరెడ్డి సోదరుడి కుమారుడు సురేంద్ర నాథ్ రెడ్డి ఎర్ర గంగిరెడ్డి, భరత్ యాదవ్ లను సీబీఐ అధికారులు విచారించారు. ఒక్కోక్కరిని ఐదు నుంచి ఆరు గంటల పాటు విచారణ జరిపారు.
వారిచ్చే సమాధానాలను రెవిన్యూ అధికారుల సమక్షంలో స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. నిన్న పులివెందుల కోర్టుకు వచ్చిన సునీల్ యాదవ్ న్యాయవాది యతీష్ రెడ్డి బెయిల్ పిటిషన్ కోసం పత్రాలను తీసుకోనేందుకు వచ్చినట్లు సమాచారం. కస్టడిని పోడిగించాలంటూ మెజిస్ట్రేట్ ను సీబీఐ అధికారులు కోరారు. వాచ్మెన్ రంగన్న ఇచ్చిన వాగ్మూలం ప్రకారం ఒక్కోక్కరిని విచారిస్తున్నారు. హత్యకు ముందు, హత్య జరిగిన తర్వాత ఎవరెవరు వివేకా ఇంటికి వచ్చారో పూర్తి సమాచారం రంగన్న ఇచ్చాడు.