ప్రజా రాజధాని అమరావతిలో చంద్రబాబు నాయుడు ఇన్ సైడర్ కు పాల్పడ్డారని ఆరోపించిన వారు ఇప్పుడు సమాధానం చెప్పాలని గుంటూరు జిల్లా నరసరావుపేట టీడీపీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు డిమాండ్ చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వాదించేందుకు “వకీల్ సాబ్” లకు కోట్లుకు కోట్లు డబ్బు ఇప్పించారని ఆయన అన్నారు.
తీరా వారంతా కలిసి చంద్రబాబు నిజాయితీని నిరూపించి, చంద్రబాబు కీర్తిని దశదిశలా వ్యాపింపచేశారని ఆయన అన్నారు. చంద్రబాబు కీర్తి ప్రతిష్టల్ని జాతీయ స్థాయిలో పెంచి ఆయన నిజాయితీని నిరూపించినందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ రెడ్డికి టీడీపీ తరుపున కృతజ్ఞతలని డాక్టర్ చదలవాడ అన్నారు.
నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారని అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ మొదలు నాటి కాంగ్రెస్ మంత్రులు, నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి న్యాయస్థానాల్లో దాదాపు 30 వ్యాజ్యాలు,హౌస్ కమిటీలు వేసినా ఒక్కదాన్ని నిరూపించలేక చితికిలబడ్డారని ఆయన అన్నారు.
ప్రతి కేసులో చంద్రబాబు తన నిజాయితీని, చిత్తశుద్ధిని నిరూపించుకొని నిప్పులాంటి మనిషి గా గుర్తింపు పొందారని ఆయన కితాబిచ్చారు. నిప్పుకు చెదపట్టడం, చంద్రబాబు నాయుడు తప్పు చేయడం,అవినీతికి పాల్పడడం జరగనే జరగదని ఆయన తేల్చి చెప్పారు.
రాజధాని అమరావతి లో చంద్రబాబు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని, అవినీతితో ఆస్తులు సంపాదించారని, అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబు పై విష ప్రచారంతో వాగిన కుహనా మేధావులు సుప్రీం తీర్పు పై సమాధానం చెప్పాలని ఆయన సవాల్ విసిరారు.
అమరావతికి తాను వ్యతిరేకం కాదని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్ మూడు రాజధానులు పేరిట నేడు డ్రామాలు ఆడటం పై రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి తన తీరును, పద్ధతిని మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని డాక్టర్ చదలవాడ తీవ్రంగా హెచ్చరించారు.