వేలకు వేలు ఫీజులు గుంజుతూ పేద విద్యార్ధులను పీడిస్తున్న కాలేజి యాజమాన్యాన్ని అదేమని అడగడానికి వెళ్లిన ఎస్ఎఫ్ఐ విద్యార్ధుల్ని వైసిపి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి బెదిరించారు. ఇష్టం అయితే చదవండి లేకుంటే వెళ్లిపోండి లేకపోతే పోలీసుల్ని పిలిచి కేసులు పెట్టిస్తా అంటూ తీవ్రంగా హెచ్చరించారు.
నరసరావుపేటలోని SKRBR రెడ్డి కాలేజ్ లో పరీక్ష ఫీజు డిగ్రీ 2వ సంవత్సరం వాళ్ళకి రూ. 570 వసూలు చేయాల్సి ఉండగా రూ. 1500, అలాగే డిగ్రీ 3వ సంవత్సరం వారికి ఫీజు రూ. 1250 అయితే రూ.3000 వేలు కట్టమని ఆదేశాలు జారీ చేశారు. కట్టనివారికి అటెండెన్స్ వేయకుండా వేధిస్తున్నారు. దాంతో ఈ సమస్యను కాలేజి యాజమాన్యం పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రంగంలో దిగింది.
కాలేజి ఎదుట వారు ధర్నా చేయడంతో ప్రిన్సిపాల్ లేరని ఆయన వచ్చిన తర్వాత సమస్య పరిష్కరిస్తామని సిబ్బంది చెప్పడంతో వారు వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రిన్సిపాల్ విషయం తెలుసుకుని కాలేజి సెక్రటరీ, గురజాల ఎమ్మెల్యే అయిన కాసు మహేష్ రెడ్డికి చెప్పారు. దాంతో మహేష్ రెడ్డి మరునాడు కాలేజీకి వచ్చి ఎస్ఎఫ్ఐ విద్యార్ధుల్ని పిలిచారు.
చర్చలకు వెళ్లిన వారిని ఆగ్రహంగా కేకలు వేస్తూ పిచ్చి వేషాలు వేస్తే పోలీసులతో కేసులు పెట్టిస్తానని మహేష్ రెడ్డి హెచ్చరించారని ఎస్ఎఫ్ఐ విద్యార్ధులు తెలిపారు. మీరు వందమందిని తెస్తే నేను వెయ్యిమందిని తెచ్చి కొట్టిస్తానని ఎమ్మెల్యే హెచ్చరించడంతో ఒక్క సారిగా బిక్క మొహం వేసిన విద్యార్ధులు మానసిక వేదనతో వెనుదిరిగారు.