డిసెంబర్ 4వ తేదీ…. ఏముంది ప్రత్యేకత అనుకుంటున్నారా? ఆ రోజుతో గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం 100 రోజులు పూర్తి అవుతుంది. కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి 100 రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఎంపిలు గడప గడపకు వెళ్లాలని, అక్కడ ప్రజల్ని కలిసి వారికి జగనన్న పేరుతో ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు తెలియచేయాలని పార్టీ అగ్ర నాయకులు వేసిన ప్లాన్. గడప గడపకు పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు చాలా చోట్ల ప్రజల నుంచి ప్రతిఘటన ఎదుర్కొన్నారు. తమకు సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని ఫిర్యాదులు చేశారు.
ఎమ్మెల్యేలను నిలదీశారు. కార్యక్రమం మొదట్లోనే ఈ విధమైన ప్రతిఘటన ఎదురుకావడంతో ఉన్న పరువు పోగొట్టు కోవడం ఎందుకని చాలా మంది ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. దాంతో ఈ కార్యక్రమం 50 రోజులు పూర్తి కాగానే సిఎం జగన్ తన వద్ద ఉన్న రిపోర్టు బయటపెట్టి ఎవరెవరు ఈ కార్యక్రమంలో పాల్గొనడంలేదో తేల్చి చెప్పారు. గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనని ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఎన్ని హెచ్చరికలు పంపినా ఇంతకంటే పనిచేయలేమని.. అసలు సాధ్యమయ్యే పనికాదంటూ కొందరు ఎమ్మెల్యేలు తేల్చి చెబుతున్నారు.
మా చేతిలో ఏముందని ప్రజలను కలుస్తాం. అంతా సీఎంకే క్రెడిట్ అంతా పోతోంది. కనీసం వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు ఉన్న గౌరవం కూడా ప్రజలు మాకు ఇవ్వడం లేదు. నిధులు లేవు.. విధులు లేవు. అటువంటిది ప్రజలెందుకు మమ్మల్ని పట్టించుకుంటారు. ఏదైతే అది జరుగుతుంది. ఇంతకంటే మేము ఏమీ చేయలేము. మాపై పర్యవేక్షకులను నియమిస్తే అది పార్టీకి అంతిమంగా నష్టం చేకూరుతుందని కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు.
గడప గడపకు కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మొత్తం సమీక్ష నిర్వహించి పాల్గొనని ఎమ్మెల్యేలపై చర్య తీసుకుంటానని కూడా జగన్ హెచ్చిరించారు. ఇప్పుడు వంద రోజులు పూర్తి కాబోతున్నది. డిసెంబర్ 4 క్లోజింగ్ ప్రోగ్రాం…ఈ 100 రోజుల కార్యక్రమంలో ఎవరు తిరిగారు ఎవరు తిరగలేదు అంటూ లెక్కలు తీస్తున్నారు. 50 రోజుల తర్వాత జగన్ పెట్టిన మీటింగ్ లో చెప్పిన పేర్లు గలవారు ఎవరు ఆ తర్వాత కూడా పాల్గొనలేదని అంటున్నారు. ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ బాగాలేని చోట్ల వేరే ఇన్ చార్జిలను నియమిస్తామని చెప్పినా కూడా ఎవరూ భయపడలేదు.
సీటు ఉంటుందా గల్లంతు అవుతుందా అనేది తర్వాతి విషయమని, ఇప్పుడు మాత్రం తాము ప్రజా వ్యతిరేకత ఎదుర్కొనలేమని ఎమ్మెల్యేలు తెగేసి చెబుతున్నారు. గడప గడప కు కార్యక్రమాన్ని అడ్డంపెట్టుని తమకు టిక్కెట్లు ఎగగొడతారేమోనని కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.