కాంగ్రెస్ పార్టీలో గెలిచి, నియోజకవర్గ అభివృద్ధి పేరుతో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ చేరి 2ఏళ్లు గడిచింది. అయితే నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి మాత్రం శూన్యమని.. తాను మాత్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాడని ఎల్లారెడ్డి కాంగ్రెస్ నేతలు విమర్శించారు.
టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పై ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఓవైపు వారి వారి నియోజకవర్గాలలో అభివృద్ధి కోసం స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వానికి తమ సమస్యలను వివరిస్తుంటే.. ఈ ఎమ్మెల్యే మాత్రం నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని తిరుమల సాగర్ లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు.
కాగా, రోజు రోజు కు ప్రజల్లో తనపై వస్తున్న వ్యతిరేకతను పక్కదోవ పట్టించడానికి సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా అధికార పార్టీలో ఉండి… నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు నెల రోజుల్లో పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చాలేదని ప్రశ్నించారు.
ఈ ఎమ్మెల్యే కేవలం కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీకి పరిమితం అయ్యారని అన్నారు. ఎమ్మెల్యే సురేంధర్ ఇప్పటికయినా నియోజకవర్గ అభివృద్ధి చేపట్టాలని అన్నారు. అభివృద్ధి ని విస్మరిస్తే అడుగడుగునా ప్రజలే అడ్డుకునే రోజులు దగ్గరపడతాయని అన్నారు.