37.2 C
Hyderabad
March 29, 2024 19: 47 PM
Slider ఆంధ్రప్రదేశ్ సంపాదకీయం

చెత్తపలుకు: మోడీని కలిస్తే భయమెందుకు?

pjimage (8)

టెలిపతీ, క్లార్ వాయిన్స్ లాంటి విద్యల్లో మన ఆ.జ్యో.రా కు బాగా ప్రవేశమున్నట్లుంది. ఏ గదిలో ఎవడు ఏం మాట్లాడుకున్నా ఇతగాడికి తెలిసిపోతున్నది. నాలుగు గోడల మధ్య అమిత్ షా ఏమనుకుంటున్నాడో తెలుస్తున్నది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానిని కలిసి ఏం చెప్పారో తెలిసిపోతున్నది. ఏం చెప్పారో అనే విషయమే కాదు. మనసులో ఏమనుకుంటున్నారో కూడా ఆ.జ్యో.రాకి అర్ధమైపోతున్నది. ఈ రెండు విద్యలతో బాటు ఫ్యూచర్ రీడింగ్ కూడా బాగా తెలిసిపోయింది ఇతగాడికి.

ఈ వారం కొత్తపలుకులో మరిన్ని దారుణమైన విషయాలను ఆ.జ్యో.రా కనిపెట్టేశాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మదగిన వ్యక్తి కాదని ఈ ఆ.జ్యో.రా తీర్పు చెప్పేశాడు. ఈ ఆ.జ్యో.రాకు కేవలం సిబి నాయుడు ఒక్కడే నమ్మదగిన వ్యక్తి. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అదీ కూడా బాజాప్తా రెండో సారి గెలిచి చూపించిన నాయకుడు. ప్రధానిని కలిస్తే తప్పేంటి? ప్రధానిని మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు నిధులు అడిగితే తప్పేంటి? ఇవ్వడం ఇవ్వకపోవడం కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక వెసులుబాటుపై ఆధారపడి ఉంటుంది.

రాజ్యాంగ పోస్టుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు కలిస్తే కేవలం రాజకీయాలే మాట్లాడుకుంటారని చెప్పడం అంత అవివేకం మరొకటి ఉండదు. అయితే ఆ.జ్యో.రా మాత్రం ప్రతి విషయంలో రాజకీయ కోణమే వెతుకుతాడు. కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన కొందరు నేతలు అమిత్ షాను కలిసి కేసీఆర్ తో భవిష్యత్తులో బిజెపి కేసీఆర్ కలిసిపోతే తమ గతమేమిటని అడిగారట. అందుకు సమాధానంగా కేసీఆర్ నమ్మదగిన వ్యక్తి కాదని చెప్పాడట. ఏం కథలు రాస్తావు సోదరా? రాజకీయ ఎత్తుగడలు వేరు రాజ్యం నడపడం వేరు.

నీలాగా, నీ సిబి నాయుడిలాగా ప్రతిదీ లెక్కలు వేసుకుని పప్పులో కాలేయరు. తెలంగాణలో బిజెపి పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అందుకు ఆ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోయింది కాబట్టి ఆ గ్యాప్ లో బిజెపి చేరేందుకు ప్రయత్నిస్తున్నది. ఇది నువ్వేదో తవ్వి కనిపెట్టక్కర్లేదు. ఇందులో బిజెపి కేసీఆర్ ను నమ్మడం నమ్మకపోవడం ఏమిటి? అంటే బిజెపి కేసీఆర్ ను నమ్ముకుని ఇక్కడ పార్టీ పెరగకుండా చేసుకోవాలనా నీ ఉద్దేశ్యం? లేదా ఇద్దరూ కలిస్తే నీ బండారం, నీ సిబి నాయుడి బండారం బయటపెడతారేమోననా?

ఎందుకు నీకు భయం? బిజెపి ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయాలని చూస్తున్నదట. ఆహా ఇది మరో గొప్ప విశ్లేషణ. వేయండి వీడికో వీరతాడు. ఏదైనా రాజకీయ పార్టీ అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఇదే లాజిక్ ప్రకారం బిజెపి శివసేనను చిదిమేయాలి కదా? మరి ఆ పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నది? ఏపిలో చంద్రబాబునాయుడిని ఫినిష్ చేసిన తర్వాత బిజెపి జగన్ పని పడుతుందట. సిబినాయుడిని ఫినిష్ చేసిన తర్వాత ఇక బిజెపి నే ఆ ప్లేస్ లోకి వస్తుంది కదా పేచీ ఏ ముంది?

సిఎం లు ఎన్ని సార్లు పిఎం ను కలిసినా కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా రాదట. ఆ.జ్యో.రా చెప్పేస్తున్నాడు. ఎంత మంచి విషయం? ఇది నీ కోరికా? సిబినాయుడి కోరికా? క్లారిటీ ఇవ్వవా సోదరా? బిజెపి పెద్దలు ఇటు కేసీఆర్ ను అటు జగన్ ను ఇద్దరినీ విశ్వాసంలోకి తీసుకోవడం లేదట. బిజెపి ఈ ఇద్దరిని ఎందుకు విశ్వాసంలోకి తీసుకుంటుంది? ఈ మాత్రం సోయి లేదా సోదరా? ఇవన్నీ వేరు వేరు పార్టీలు కదా బ్రదర్?

నీ ప్లాన్ ఏమిటంటే ఈ మూడు పార్టీల మధ్య విభేదాలు సృష్టిస్తే కదా నీ సిబినాయుడు దగ్గర కావడానికి మార్గం ఏర్పడేది. అదీ నీ బాధ. నువ్వే బాధ పడకు సోదరా. ఈ మూడూ వేరు వేరు పార్టీలు కలవవు. నువ్వే దిగులు పడద్దమ్మా. జగన్ ప్రధానిని కలిసినప్పుడు ఏం మాట్లాడారు? – ఎన్నికలు పూర్తయి నాలుగు నెలలు కావస్తున్నది కదా? ఇంకా చంద్రబాబు పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ఇంకా ఎందుకు అరెస్టు చేయడం లేదు?

నీకు సిబిఐ సహాయం కావాలంటే మేం ఇస్తాం త్వరగా అరెస్టు చేసేయి. తెలుగుదేశం పార్టీ వాళ్లను వదలద్దు. చేరేవాళ్లను మా పార్టీలో చేర్చు. వీలుకాకపోతే మీ పార్టీలో చేర్చుకో- అని ప్రధాని మోడీ ఏపి సిఎం జగన్ తో చెప్పాడు అని నేను రాసేస్తా. అందులో నిజం ఏముంటుంది? అసలు వారేం మాట్లాడారో నీకేం తెలుస్తుంది?

చేతిలో పేపర్ ఉంది కదా అని ఎల్లిమీద, మల్లిమీద పెట్టి రాయడం జర్నలిజమా? నీ వికారమైన కోరికలు ప్రదర్శించడం జర్నలిజమా? సిబి నాయుడిపై ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇప్పటి వరకూ ఆయనపై వచ్చిన ఆరోపణలు కరెక్టు కాదట. వామ్మో ఈ కొత్తపలుకు జడ్జిమెంటు కూడా ఇచ్చేస్తున్నది. ఆధారం లేకుండా మర్డర్ చేసేటోడ్ని పట్టుకోవడానికి సమయం పడుతుంది కదా సోదరా? వెయిట్ చెయ్యి. మరో ముఖ్య విషయం ఏమిటంటే సంక్షేమ పథకాలు ఓట్లు రాల్చవని ఈ ఆ.జ్యో.రా చెబుతున్నాడు.

గత వారం కూడా ఇదే రాశాడు. అప్పుడు నేనూ రాశాను – బహుశ పసుపు కుంకుమ ఎఫెక్టు ఇప్పటికి తెలిసిందా అని. మళ్లీ అదే రిపీట్. ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా 1989లో ఎన్టీఆర్ ఓడిపోయాడట. ఇందులో కూడా వక్రీకరణే. ఎన్టీఆర్ ఓడిపోయింది సంక్షేమ పథకాలు అమలు చేసినందుకూ కాదు, చేయనందుకూ కాదు. అప్పటిలో కులతత్వం పెరిగిపోవడం వల్ల ఎన్టీఆర్ ఓడిపోయాడు (ఇప్పుడు సిబినాయుడి లానే) అప్పటిలో పిసిసి అధ్యక్షుడుగా ఉన్న మర్రి చెన్నారెడ్డి ఎన్టీఆర్ ఒకే సామాజిక వర్గం వారితో చేసిన నియామకాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేయించారు.

దాంతో ఇంత కులతత్వమా అని ఏవగించుకుని ఎన్టీఆర్ ను ప్రజలు ఓడించారు. ముఖ్యమంత్రులు ప్రజల కోసం అవి అడిగాం ఇవి అడిగాం అని అంటారే గానీ ముఖా ముఖి కలిసినప్పుడు వ్యక్తిగత రాజకీయ అంశాలే మాట్లాడుకుంటారట. నీవేం చేస్తావో అదే అందరూ చేస్తారనుకుంటే తప్పు కదా సోదరా? మరి చంద్రబాబు 36 సార్లు కలిసి ఏం మాట్లాడాడు? రాష్ట్రం గురించి కాదని నీవు చెబుతున్న విషయాలను బట్టి అర్ధం అవుతున్నది. 36 సార్లు ప్రధానిని కలిసి చంద్రబాబు తన సొంత విషయాలే మాట్లాడుకున్నారన్న మాట. అందుకే మోడీకి చిరాకు పుట్టి సిబి నాయుడిని వదిలించుకున్నాడన్నమాట. సివినాయుడికి జరిగిన అనుభవాన్ని ఎంత చక్కగా ఎంత వివరంగా చెప్పావు సోదరా. నిజాలు చెప్పిన నీకు ధన్యవాదాలు

Related posts

అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన ఉపాధి క్షేత్ర సహాయకులు

Satyam NEWS

ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే కాలేరు యోగా

Satyam NEWS

విజయవాడలో అష్టోత్తర శత కుండాత్మక శ్రీలక్ష్మీ మహాయజ్ణం

Satyam NEWS

Leave a Comment