ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే శుక్రవారం ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్టు బిజేపి వెల్లడించింది. ఈ నెల 25న సాయంత్రం 4 గంటలకు యోగి వరుసగా రెండోసారి యూపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం లఖ్నవూలోని ఎకానా స్టేడియంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నట్లు సమాచారం. కొత్త మంత్రివర్గంలో 20 మందికి పైగా కేబినెట్ హోదా మంత్రులు ఉంటారని, దాదాపుగా అదే సంఖ్యలో స్వతంత్ర, సహాయ హోదా అమాత్యులు ఉంటారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి బిజేపి యేతర ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశం వున్నది. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపి భారీ విజయంతో వరుసగా రెండోసారి అధికార పీఠం దక్కించుకున్న విషయం తెలిసిందే.
previous post