రాష్ట్రంలో కరోనా వైరస్ పూర్తిగా పోదని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంకా ముఖ్యమంత్రి ఏమన్నారంటే ‘కరోనా అనేది ఒక భయంకరమైన రోగం అనో, ఇది అంటరాని రోగమో, లేక ఇంకొకటో అన్న భావన దయచేసి అందరూ బుర్రలో నుంచి తీసేయమని చెప్పి నేను సవినయంగా అందరితో విజ్ఞప్తి చేస్తున్నాను.
ఎందుకంటే మన జీవనంలో ఇది కూడా ఒక అంతర్భాగం అవుతుంది. స్వైన్ఫ్లూ అని ఇంతకు ముందు చూశాం. అది కూడా అంతే. అది అలా వ్యాపిస్తూ ఉంటుంది. స్వైన్ఫ్లూ ఉన్న వ్యక్తి పక్కన ఉన్న ఇంకొకరికి కూడా అంటించగలుగుతాడు. చికెన్పాక్స్. అమ్మోరు అంటాం. ఇటువంటివన్నీ కూడా వస్తాయి.
అవి వచ్చిన వ్యక్తి పక్కన ఉన్న వారికి కూడా అంటుకుంటాయి. కానీ అవన్నీ కూడా నయం అయ్యేటివి. కరోనా కూడా అంతే. అది వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకుంటే, మందులు వేసుకుంటే నయమైపోతుంది. వైరస్ వచ్చినట్లు కూడా తెలియదు. ఏ లక్షణం కనిపించదు. అంటే కరోనా ఉందన్న సంగతి మనకే తెలియదు.
అటువంటి వాళ్లు దాదాపుగా 80 శాతం ఉన్నారని ఈ మధ్య కాలంలో లెక్కలన్నీ చెబుతున్నాయి’ అని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఒక మనిషి ఎక్కడో ఒక చోట మిగిలిపోయినా కూడా, ఆ మనిషి మళ్లీ ఎక్కడో ఒక చోట దగ్గడం, తుమ్మడం చేస్తాడు. అది ఎక్కడో ఒక చోట అంటుకుంటూ పోతుంది.
ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇది ఎప్పటికి కూడా పూర్తయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకీ విషయాలు చెప్పాల్సి వస్తా ఉంది అంటే, రాబోయే రోజుల్లో కూడా మనం కరోనాతో కలిసి జీవించి ఉండాల్సిన పరిస్థితే ఉంటుందని కూడా మనందరం కూడా గమనించాలి అని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ చెప్పారు.
‘కరోనా విషయానికి వస్తే ఇంతకు ముందు చెప్పినట్లు.. 81 శాతం కేసులు ఇళ్లలోనే ఉండి నయం అయిపోయిన కేసులు. కేవలం 14 శాతం కేసులు మాత్రమే ఆస్పత్రికి పోయేవి. అందులోనూ ఐసీయూకి పోయేవి కేవలం 5 శాతం మాత్రమే.
ఇక చనిపోతున్న వారి సంఖ్య ఎంత అని చూస్తే, దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా మూడు, నాలుగు శాతం లేదని లెక్కలు చెబుతున్నాయి’ అని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి ఇదేదో అంటరానిదన్నట్లుగా చూడవద్దని ఆయన అన్నారు. ఈరోజు ఎల్లయ్య, పుల్లయ్యకు రావొచ్చు.
రేపు పొద్దున నాకైనా రావొచ్చు. ఇంకెవరికైనా రావొచ్చు. వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. మందులు తీసుకోవాలి. చాలా వరకు ఆస్పత్రులకు కూడా పోవాల్సిన పరిస్థితి ఉండదు. ఇంట్లోనే నయం అవుతుంది. కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్లను ప్రభావితం చేయగలుగుతాం కాబట్టి వారి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలు అని ఆయన వివరించారు.