కరోనా మహమ్మారి కారణంగా గత నెల రోజులుగా దేశంలో అమలవుతున్న లాక్ డౌన్ తో అనేక కుటుంబాలు అతలాకుతలం అవుతున్నాయి. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఆకలికి అలమతుస్తున్నాయి. ఉపాధి అవకాశాలు లేక కూలీలు కుదేలు అవుతున్నారు.
ఇది నిరుపేదల పరిస్థితి. ఇక కరోనా రక్కసిని పారద్రోలాడానికి ప్రభుత్వ యంత్రాంగం చేపడుతున్న కట్టుదిట్టమైన చర్యల్లో అధికారులు నిమిషం తీరిక లేకుండా పనిచేస్తున్నారు. ఈ కోవలోకి పోలీసులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, కలం కార్మికులు ఇలా అనేక మంది ఉన్నారు.
కరోనా కంత్రి కారణంగా ఇబ్బందులు ఎదురుకుంటున్న ప్రజలను ఆదుకునేందుకు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు ఇలా అనేక మంది నిత్యావసర సరుకులు, ఆహార ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీకి చెందిన పలువురు యువకులు గత15 రోజులుగా ప్రతి రోజు భోజనాలను తయారు చేస్తూ అనేక మంది ఆకలిని తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
‘ఇండియన్ సొసైటీ సర్వీస్’ పేరుతో స్థానిక యువకులు 65వ నెంబర్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ నుండి కట్టంగూర్ వరకు మొబైల్ వాహనం ద్వారా ఆకలితో అల్లాడుతున్న అనేక మంది క్షుద్భాదను తీరుస్తూ అన్నదాతలుగా నిలుస్తున్నారు. సుమారు 50 కిలోమీటర్ల మేర సంచరిస్తున్న భిక్షగాళ్ళు, మతిస్థిమితం లేనివారు, సంచార జాతుల వారు, పాదచారులు ఇలా ఎవరు కనిపిస్తే వారి దగ్గర వాహనాన్ని ఆపి భోజనాన్ని అందిస్తున్నారు. నార్కట్ పల్లి లోని వృద్ధాశ్రమంలో వృద్దులకు భోజనాలు, పండ్లు, మజ్జిగలను అందిస్తున్నారు. వెల్మినేడు గ్రామం దగ్గర ఏర్పాటు చేసిన పికెటింగ్ లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న పోలీసులకు కూడా అన్నదానం చేస్తున్నారు. కరోనా కట్టడితో స్తంభించిన నేపధ్యంలో దీనులను ఆదుకునే భాధ్యతను తీసుకున్న ‘ఇండియన్ సొసైటీ సర్వీస్’ లీడర్ కంబాలపల్లి సతీష్, సభ్యులను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.