విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో మహాత్మా గాంధీ 152వ జయంతి జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ జయంతి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎం.దీపిక పాల్గొని, మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఎస్పీ దీపిక మాట్లాడుతూ – సమాజంలో శాంతియుత స్థాపనకు మహాత్ముడు చూపిన అహింసా మార్గం, సెక్యులరిజం అన్నవి ప్రతీ ఒక్కరూ ఆచరించాల్సిన మార్గాలన్నారు. “సమాజంలో ఏమార్పునైతే మనము కోరుకొంటున్నామో.. అటువంటి మార్పు ముందుగా మనతోనే ప్రారంభం కావాలని” మహాత్ముడి బోధనలను ప్రతీ ఒక్కరూ పాటించాలన్నారు.
సమాజంలో శాంతిని ఎల్లప్పుడూ కోరుకొనే పోలీసుశాఖ అయితే గాంధీజీ చూపిన అహింస, శాంతి మార్గంలోనే పయనించి, ప్రజల్లో మార్పును తీసుకొని రావాలన్నారు. సమాజంలో అందరిని మంచి పౌరులుగా మనము మార్చలేకపోయినా, కొద్ది మందినైనా హింసా ప్రవృత్తి నుండి దూరం చేసి, వారిని అహింసా మార్గం లో పయనించే విధంగా పోలీసు ఉద్యోగులు తమవంతు కృషి చెయ్యాలన్నారు.
మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకొని ప్రతీ ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడిచి, నిజాయితీతో, దేశం పట్ల గౌరవం, భక్తి, ప్రవర్తులు కలిగి, శాంతిభద్రత లకు ఎటువంటి భంగం కలగకుండా ప్రతీ ఒక్కరూ తమవంతు కృషి చెయ్యాలన్నారు. అసాంఘిత కార్యకలాపాల వైపు యువత ఆకర్షితులైతే, వారికి కౌన్సిలింగు నిర్వహించి, వారిని సక్రమమైన మార్గంలో నడిచే విధంగా పెద్దలు మార్గాన్ని నిర్దేశం చేయాలన్నారు.
హింసాత్మక సంఘటనలు నుండి యువత ప్రేరణ పొందవద్దని, ప్రతీ ఒక్కరూ గాంధీజీ చూపిన అహింసా మార్గంలో నడవాలని, పోలీసులకు సహకరించాలని యువతకు, ప్రజలకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక పిలుపునిచ్చారు.
అనంతరం, ఒఎస్ డి ఎన్.సూర్యచంద్రరరావు, అదనపు ఏస్పీ పి.సత్యన్నారాయణరావు, ఎఆర్ డీఎస్పీ ఎల్.శేషాద్రి, ఎస్బీ సీఐ జి. రాంబాబు, ఆర్ ఐలు చిరంజీవరావు, నాగేశ్వరరావు, టివిఆర్ కుమార్, రమణమూర్తి, ఈశ్వర రావు, మరియన్ రాజు, ఆర్ఎస్ఏలు నారాయణరావు, నర్సింగరావు, రమేష్, ప్రసాదరావు, ఎస్బీ ఎస్ఐ విక్రమరావు ఇతర పోలీసు అధికారులు, ఏఆర్ మరియు ఎస్టీఎఫ్ సిబ్బంది పాల్గొని, మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాలలు, పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.