వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య విజయలక్ష్మి హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా పిలిచారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడిగా అధికారంలో ఉన్న జగన్ ను ఈ సమావేశానికి ఆయన తల్లి పిలవలేదని కొందరు అంటున్నారు.
కుమార్తె షర్మిల తెలంగాణలో పెట్టిన పార్టీకి సపోర్టుగా పావులు కదుపుతున్న విజయలక్ష్మి కుమారుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఈ సమావేశానికి దూరం పెట్టినట్లే కనిపిస్తున్నది. వైఎస్ సన్నిహితులు, ఆప్తుల జాబితాలో జగన్ పేరు లేకపోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తల్లడిల్లుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ పేరుతో అధికారంలో కొనసాగుతున్న తమ నాయకుడిని ఆత్మీయుల సమావేశానికి పిలవకపోతే ఇక తాము వైఎస్ వారసులమని ఎలా చెప్పుకోగలమని వారు మధనపడుతున్నారు.
సెప్టెంబరు 2న విజయలక్ష్మి హైదరాబాద్లో ఒక స్టార్ హోటల్ లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ సమావేశానికి మాజీ మంత్రులకు ఆహ్వానాలు కూడా అందాయి. పార్టీలకు అతీతంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నామని విజయలక్ష్మి ఆహ్వానాలలో తెలపగా వైఎస్ హయాంలో పనిచేసిన మంత్రులతో పాటు సహచరులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది.
కేవలం అప్పటి కేబినెట్ మంత్రులే కాకుండా.. వైఎస్ కు అత్యంత ఆప్తులు, నమ్మకస్తులు కూడా ఆమె ఆహ్వానించినట్టు తెలుస్తోంది. మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్కుమార్ , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్తో పాటు వైఎస్ మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులకు కూడా ఆమె స్వయంగా ఫోన్చేసి ఆహ్వానించారు.
2009లో వైఎస్ఆర్ చనిపోగా ఇప్పటి వరకు ఆయన వర్ధంతి రోజున జరిగే కార్యక్రమాలకు గతంలో వైఎస్తో కలిసి పనిచేసివారిని ప్రత్యేకంగా ఆహ్వానించ లేదు. ఇలా ఆహ్వానించడం ఇదే తొలిసారి. ఇదే ఇప్పుడు పలు రాజకీయ ఊహాగానాలకు అవకాశంగా మారింది.
వైఎస్ కుటుంబంలో విభేదాలున్నాయని.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో విభేదించి చెల్లి షర్మిల తెలంగాణలో సొంత పార్టీని ఏర్పాటు చేశారని రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చలు జరుగుతుండగా ఇలాంటి సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా విజయలక్ష్మి భర్త వర్ధంతి రోజున సమావేశానికి ఆహ్వానాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా ఉంటూనే విజయమ్మ తెలంగాణలో షర్మిల పార్టీకి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఆవిర్భావ సభలో కూడా విజయమ్మ కాంగ్రెస్ పార్టీపై పలు విమర్శలు చేయగా ఇప్పుడు ఆహ్వానం పంపిన వారిలో ఎక్కువ శాతం ఆ పార్టీ నేతలే ఉన్నారు. ఈ సమావేశం ఎలాంటి రాజకీయ ప్రకంపనలు సృష్టించనుందన్నది ఆసక్తికరంగా మారింది.