అన్ని హక్కు పత్రాలు ఉన్నా కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రోత్సాహంతో అధికారులు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడి ఇంటిని కూల్చివేయడం దారుణమని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు.
నియోజకవర్గ పరిధిలోని కుందుర్పి మండలం మలయనూర్ గ్రామంలో రామకృష్ణ అనే తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడి ఇంటిని కూల్చివేసిన సంఘటనను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజా వేదిక కూల్చివేసిన సంఘటనతో విధ్వంసకర పాలనకు శ్రీకారం చుట్టిందని అన్నారు.
ఆ సంస్కృతిని మారుమూల గ్రామాలకు సైతం విస్తరింపజేశారన్నారు. టిడిపి సానుభూతిపరుల ఇళ్ళను కూల్చివేయడం దారుణమన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే దాకా పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దొడగట్ట నారాయణ, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.