కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ఇప్పటి వరకూ ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడూ చేయని విధంగా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ రెవెన్యూ లోటును కేంద్రం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసి వాటిని కేంద్రం పట్టించుకోకపోతే ఎలా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
కాకినాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘ఆంధ్రప్రదేశ్ ఆరేళ్ల వయస్సున్న బాలుడు లాంటింది. తండ్రిని చూసి ఎవరైనా అప్పు ఇస్తారు కానీ.. బాలుడ్ని చూసి ఇవ్వరు.
ఆర్థికంగా చిన్న రాష్ట్రాలను నిర్వీర్యం చేస్తే ఆశించిన ప్రయోజనాలు చేకూరవు. జీఎస్టీ, పోలవరం నిధులను కేంద్రం ఎగనామ పెట్టడం ఏపీ ప్రజలకు బాధాకరం. కరోనా కారణంగా మీ పాట్లు మీరు పడండి అని కేంద్రం ఉచిత సలహ ఇస్తే ఏపీ ప్రజలు చూస్తూ ఊరుకోలేరు.
ఏ ప్రయోజనాలను ఆశించి ఆంధ్రప్రదేశ్ను విభజించారో.. ఆ ప్రయోజనాలను రక్షించాల్సిన బాధ్యత కేంద్రం పై ఉందని’’ సుభాస్ చంద్రబోస్ పేర్కొన్నారు.