ఆంధ్రప్రదేశ్ లో అరాచకం రాజ్యం ఏలుతున్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాలపర్తి డేవిడ్ రాజు వ్యాఖ్యానించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత ఈ విధంగా వ్యాఖ్యానాలు చేయడం పలువురిని ఆశ్చర్య పరిచింది.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే అయిన డేవిడ్ రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైనే ఆరోపణలు చేయడంతో ఒక్క సారిగా సంచలనం రేగింది.
చంద్రబాబు నాయకత్వంలో ప్రజా బద్ద పరిపాలన రావాల్సిన అవసరం ఉందని ఆయన ఆకాంక్షించారు. వైసీపీలో అసంతృప్తి గా ఉన్న డేవిడ్ రాజు ఇటీవల టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో ఒంగోలు టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ డేవిడ్ రాజుతో భేటి అయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడితో కలిసి టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నానని డేవిడ్ రాజు తెలిపారు.
గతంలో తెలుగు దేశం పార్టీ అభివృద్దికి పని చేశానని, తన వల్ల మధ్యలో కొన్ని పొరపాట్లు జరిగాయని చెప్పారు. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు డేట్ ఖరారు చేస్తే పార్టీలో చేరేందుకు సిద్దమని డేవిడ్ రాజు ప్రకటించారు.