కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసుల సాయంతో బిజెపి మైనారిటీ నాయకుడు హాసన్ ను కిడ్నాప్ చేసి హత్యాయత్నం చేసిన సంఘటనపై బిజెపి రాష్ట్ర పోలీసు డీజీపికి ఫిర్యాదు చేసింది.
బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ యస్.విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం నేడు డీజీపీ కార్యాలయం లో అడిషనల్ డీజీపీ రవి శంకర్ అయ్యన్నర్ ని కలిసి వినతిపత్రాన్ని అందచేసింది.
ఒక కర్నూలు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో అనేక చోట్ల వైసిపి అరాచకాలకు అడ్డులేకుండా పోతున్నదని ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. అధికార పార్టీ నాయకుల అవినీతిని ప్రశ్నిస్తే ,కిడ్నాప్ లు,హత్యయత్నాలు,భౌతిక దాడులు చేస్తున్నారని ఆయన అన్నారు.
ఇదేనా వైకాపా పాలన అని ఆయన ప్రశ్నించారు. ఈ దాడులను ఇక ఉపేక్షించేది లేదని, రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఈ అంశాలను కేంద్ర హోమ్ శాఖ దృష్టికి తీసుకెళతామని ఆయన చెప్పారు.
ఆళ్లగడ్డలో దాడికి కారణమైన స్థానిక ఎమ్మెల్యేను, వారి అనుచరులైన వైసిపి పార్టీ కార్యకర్తలను, సహకరించిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పిర్యాదులో పేర్కొన్నారు.
స్థానిక పోలీసుల సహకారంతో వైసీపీ పార్టీ కార్యకర్తలు దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈరోజు విశాఖలో ఎబివిపి రాష్ట్ర నాయకులు జగదీశ్ ని బీజేవీఎం రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ లను అక్రమ అరెస్ట్ అంశం కూడా అడిషనల్ డిజిపి దృష్టికి తీసుకెళ్ళామని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.