గుంటూరు లోని జిన్నాటవర్ విషయంలో అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయం చేయకుంటే దేశద్రోహి అయిన జిన్నా పేరును తక్షణమే మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి చిత్తశుద్ధి ఉంటే జిన్నా టవర్ పై త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలని ఆయన కోరారు. లేదంటే రాష్ట్ర ప్రజలు కచ్చితంగా ఆ పని చేస్తారని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల అయిన సందర్భంగా జరుపుకుంటున్న ఆజాదీ కా అమృత మహోత్సవం లో భాగంగా ఆనాడు దేశం కోసం గొప్ప సేవలు చేసి గుర్తింపు రాని వారినెందరినో నేడు గుర్తించి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తగిన గౌరవాన్ని ఇస్తున్నదని ఆయన గుర్తు చేశారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం జాతీయ భావాలను పెపొందించేందుకు చర్యలు తీసుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం దేశ ద్రోహులను గుర్తు చేయడం అన్యాయమని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. నాడు జరిగిన అనేక తప్పులను నేడు సరిదిద్దటానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించాలని ఆయన హితవు పలికారు. మొన్న ఆత్మకూరు, నిన్న గుంటూరు రెండు సంఘటనలో కూడా మీ ప్రభుత్వం దేశ విద్రోహ శక్తులకే కొమ్ము కాస్తున్నారు కదా అని ఆయన ప్రశ్నించారు. జాతీయ జెండా ఎగురవేయకుండా పోలీసులను పెట్టి అడ్డుకోవడం ఒక భారతీయ పౌరుడుగా మీకు సిగ్గుగా అనిపించడం లేదా? మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.